నేనైతే ముందు సస్పెండ్ చేస్తా: సుష్మా స్వరాజ్
ట్విటర్ లో వచ్చే అభ్యర్థనలకు వెంటనే స్పందించి సాయం చేస్తారనే పేరు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ కు ఉంది. కానీ ఒక అభ్యర్థన ఆమెకూ చిరాకు తెప్పించింది.
న్యూఢిల్లీ: ట్విటర్ లో వచ్చే అభ్యర్థనలకు వెంటనే స్పందించి సాయం చేస్తారనే పేరు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ కు ఉంది. కానీ ఒక అభ్యర్థన ఆమెకూ చిరాకు తెప్పించింది.
పూణే కు చెందిన స్మిత్ రాజ్ అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగి ట్విటర్ ద్వారా సుష్మా స్వరాజ్ కు ఓ అభ్యర్థన పంపించారు. తన భార్య ఝాన్సీలో భారతీయ రైల్వేలో పని చేస్తోందని.. తానేమో ఉద్యోగరీత్యా పూణేలో ఉంటున్నానని.. తన భార్యను పూణేకి బదిలీ చేయించాలనేది ఆ అభ్యర్థన సారాంశం.
ఈ ట్వీట్ సుష్మా స్వరాజ్ కి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. "నా మంత్రిత్వ శాఖలో పనిచేసే భార్యాభర్తలే గనుక ఇలా ట్విటర్ లో బదిలీ అభ్యర్ధన పంపిస్తే.. ముందు వాళ్ళను సస్పెండ్ చేస్తా.." అని ఆమె సమాధానమిచ్చారు.
సదరు వ్యక్తి అభ్యర్ధనను ఆమె రైల్వే మంత్రి సురేష్ ప్రభు ట్విటర్ కి ట్యాగ్ చేశారు. దీనిపై స్పందించిన రైల్వే మంత్రి సురేష్ ప్రభు ఈ విషయాన్ని తన దృష్టికి తెచ్చినందుకు సుష్మా స్వరాజ్ కి కృతజ్ఞతలు తెలుపుతూ.. బదిలీ విషయాలలో తన ప్రమేయం ఉండదని, అంతా రైల్వే బోర్డు చూసుకుంటుందని బదులిచ్చారు.
ఈ సమస్యను పరిశీలించమని తన శాఖ ఉన్నతాధికారులను మాత్రం కోరగలనని ఆయన తెలిపారు. అంతకు ముందు సుష్మ ఓ ప్రవాస భారతీయుడికి భార్య పాస్ పోర్ట్ విషయంలో సహాయం చేశారు.
తన భార్యకి పాస్ పోర్ట్ రానందున తాను చాలా కాలంగా విదేశంలో వనవాస జీవితం గడుపుతున్నానంటూ అతడు సుష్మా స్వరాజ్ కి ట్వీట్ చేశాడు. ఆ సందర్భాన్ని గుర్తు చేస్తూ తాజాగా పూణే వ్యక్తి కూడా తాను తన భార్య వేర్వేరు రాష్ట్రాల్లో ఉంటూ వనవాసం గడుపుతున్నామని పేర్కొంటూ ట్వీట్ చేశాడు.
అయితే పాస్ పోర్ట్ కి సాయపడడం, బదిలీ వ్యవహారంలో సాయపడడం ఒకేలాంటివి కాదని తెలుసుకోలేక అతడు కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ ఆగ్రహానికి గురయ్యాడు.