మోడీకి దమ్ము లేదు: రాహుల్, సుష్మాపై తీవ్ర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: సుష్మాపై తనకు ఎలాంటి కోపం లేదని, ప్రభుత్వంపైనే అని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ లోక్ సభలో అన్నారు. లలిత్ మోడీకి సాయం చేయడంపై సభలో చర్చ జరిగిన సందర్భంగా రాహుల్ ఆవేశంగా మాట్లాడారు. సుష్మా స్వరాజ్ పై తీవ్రస్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేశారు.
ఈ చర్చలో రాహుల్ గాంధీ బీజేపీపై ప్రశ్నల వర్షం కురిపంచారు. సుష్మా స్వరాజ్పై రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. లోక్ సభలో కూర్చున్నప్పుడు సుష్మా స్వరాజ్ తనవద్దకు వచ్చి 'బాబూ.. నీకు నామీద ఎందుకు కోపం అని అడిగారు. నాకు కోపం లేదు. మీరంటే నాకు గౌరవం అని చెప్పాను' అని రాహుల్ గాంధీ అన్నారు.
లలిత్ మోడీకి సాయం చేయడంపై సుష్మా ప్రపంచంలోనే తొలి మానవతా వాదిలాగా మాట్లాడుతున్నారని అన్నారు. లలిత్ మోడీకి సాయం చేయడం వల్ల సుష్మా కుటుంబానికి ఎంత ముట్టచెప్పారో తెలపాలన్నారు. 12 కోట్ల రూపాయలు లలిత్ మోడీ ఇచ్చారా లేదా? అని ప్రశ్నించారు. ప్రధాని మోడీకి చెప్పే లలిత్ మోడీకి సుష్మా సాయం చేశారా అనే విషయాన్న సుష్మా చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రధాని నరేంద్రమోడీపై కూడా రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. లోక్సభలో లలిత్ మోడీ వ్యవహారంపై ఇంత చర్చ జరుగుతుంటే ప్రధాని మోడీ ఎక్కడున్నారని ప్రశ్నించారు. లోక్సభ సమావేశాల్లో పాల్గొనే దమ్ము మోడీకి లేదని ఎద్దేవా చేశారు. ఎవరినీ అవినీతికి పాల్పడనీయనన్న ప్రధాని మోడీ ఇప్పుడు ఎక్కుడున్నారంటూ ప్రశ్నించారు.
మోడీ చేసిన వాగ్దానాలు ఏమయ్యాయని ప్రశ్నించిన రాహుల్ గాంధీ, మోడీజీ మీ మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశం మీ మాటలు వినాలనుకుంటోంది. అవి కూడా చెప్పండని అన్నారు. లలిత్ మోడీని ఎవరు.. ఎందుకు రక్షించారు, మంత్రి రక్షిస్తున్నారా, ఆమె కూతురు రక్షిస్తోందా లేదా ఒక ముఖ్యమంత్రి రక్షిస్తున్నారా చెప్పాలని డిమాండ్ చేశారు.