డ్రీమర్స్, హెచ్-1బీ వీసాల ఇష్యూ: అమెరికాలో గట్టిగానే ప్రస్తావించిన సుష్మా స్వరాజ్
డ్రీమర్స్ , హెచ్-1బీ వీసాలపై ట్రంప్ సర్కారు తీవ్ర ఆంక్షలు విధించడంపై భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ కూడా ఈ విషయాన్ని గట్టిగానే ప్రస్తావించారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సుష్మా స్వరాజ్..
న్యూయార్క్: అత్యున్నత నైపుణ్యం గల వృత్తి నిపుణులకు ఉద్దేశించిన హెచ్-1బీ వీసాలపై ట్రంప్ సర్కారు తీవ్ర ఆంక్షలు విధించడంపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ కూడా ఈ విషయాన్ని గట్టిగానే ప్రస్తావించారు.
ఐక్యరాజ్యసమితి సార్వత్రిక అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనడానికి న్యూయార్క్ వచ్చిన సందర్భంగా సుష్మా స్వరాజ్.. అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్సన్ తో భేటీ అయ్యారు. సుష్మా-టిల్లర్సన్ భేటీ ఇదే తొలిసారి.
ఈ సందర్భంగా హెచ్-1బీ వీసాలపై అంశాన్ని సుష్మా గట్టిగా ప్రస్తావించారు. ఈ విషయమై ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాలో డ్రీమర్స్ (స్వాప్నికులు)గా ఉన్న 8 వేలమంది భారతీయుల దుర్భర స్థితిని కూడా ఆమె లేవనెత్తారు. అమెరికాలో ఉద్యోగం చేసే తల్లిదండ్రుల వెంట చిన్నారులుగా వచ్చిన వలసదారులను డ్రీమర్స్ గా పీలుస్తారు.
నిర్ణీత వలస పత్రాలలేని వీరికి ఒబామా సర్కారు కల్పించి ప్రొటెక్షన్ వచ్చే ఏడాది మార్చి తో ముగియనుంది. ఈ నేపథ్యంలో అమెరికా నుంచి డిపోర్ట్ ముప్పు ఎదుర్కొంటున్న 8 వేలమంది భవిష్యత్తు గురించి సుష్మా టిల్లర్సన్ తో జరిగిన భేటీలో ప్రస్తావించారని అధికారులు తెలిపారు.