అధికారిక నివాసాన్ని ఖాళీ చేసిన మాజీ మంత్రి, నెటిజెన్ల మనసులను గెల్చుకున్న మహిళా నేత
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ తన అధికారిక భవనంను ఖాళీ చేశారు. కొత్త ప్రభుత్వం వచ్చి సరిగ్గా నెలరోజులకు ఆమె తన నివాసంను ఖాళీ చేశారు. మోడీ రెండో కేబినెట్లో సుష్మా స్వరాజ్కు మంత్రి స్థానం దక్కలేదు. అంతేకాదు ఈ సారి ఎన్నికల్లో కూడా ఆమె పోటీ చేయలేదు. తను ఇకపై తన అధికారిక నివాసంలో ఉండటం లేదని దాన్ని ఖాళీ చేసినట్లు సుష్మా స్వరాజ్ ట్వీట్ చేశారు. న్యూఢిల్లీలోని సఫ్దార్ గంజ్ లేన్లో ఇప్పటి వరకు ఉన్నానని అయితే కొత్త ప్రభుత్వం వచ్చినందున తాను భవనాన్ని ఖాళీ చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు అంతకుముందు ఉన్న ఫోన్నెంబర్లను కూడా తాను వినియోగించడం లేదని ట్విటర్లో స్పష్టం చేశారు.
Recommended Video
సాధారణంగా ఒక ప్రభుత్వం పోయి మరో ప్రభుత్వం వస్తే పాత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వారు తమ అధికారిక నివాసాలను ఖాళీ చేయరు. నోటీసులు వచ్చేవరకు అదే నివాసాల్లో ఉంటూ పలు సదుపాయాలు పొందుతుంటారు. కానీ సుష్మా స్వరాజ్ మాత్రం ప్రభుత్వం నుంచి నోటీసులు అందుకోకముందే ఆమె ఖాళీ చేయడంపై నెటిజెన్లు సుష్మాను ఆకాశానికెత్తేస్తున్నారు. సుష్మా స్వరాజ్ ఒక మంచి మంత్రిగా పేరుగాంచారని ఇప్పుడు తీసుకున్న నిర్ణయంతో ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారంటూ నెటిజెన్లు తమ అభిప్రాయాలను ట్విటర్ వేదికగా పంచుకుంటున్నారు.
I have moved out of my official residence 8, Safdarjung Lane, New Delhi. Please note that I am not contactable on the earlier address and phone numbers.
— Sushma Swaraj (@SushmaSwaraj) June 29, 2019
భారత దేశ ప్రజలు ఓ మంచి మహిళా నాయకురాలి సేవలను మిస్ చేసుకుంటున్నారని ట్వీట్ చేశారు. ప్రభుత్వంలో ఆమె ఉండి పలు సమస్యలను ఇట్టే పరిష్కరించారని మరికొందరు అభిప్రాయపడ్డారు. కొందరు మాత్రం సుష్మా స్వరాజ్ ఆరోగ్య కారణాలు చూపిస్తూ కావాలనే కేబినెట్ నుంచి తప్పించారని అభిప్రాయపడ్డారు. అన్ని అర్హతలు ఉన్న డైనమిక్ నాయకురాలు కేబినెట్లో లేదంటే చాలా బాధగా ఉందని మరొకరు తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు. వాజ్పేయి అద్వానీల హయాంలో సుష్మా స్వరాజ్కు సముచిత స్థానం ఉన్నిందని గుర్తుచేసుకున్నారు కొందరు అభిమానులు.
ఇదిలా ఉంటే మాజీ ప్రజాప్రతినిధులందరికీ తమ అధికారిక బంగ్లాలు ఖాళీ చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొత్తగా వచ్చిన 267 మంది ఎంపీలకు ఆ బంగ్లాలను కేటాయించాల్సి ఉన్నందున త్వరగా ఖాళీ చేయాలని ఆదేశాలిచ్చింది. కొత్తగా తీసుకొచ్చిన పబ్లిక్ ప్రెమిసెస్ అమెండ్మెంట్ బిల్లు 2019లో నోటీసులు అందుకున్న ఐదు నెలల్లో బంగ్లాను ఖాళీ చేయకపోతే వారిపై రూ. 10 లక్షల జరిమానా విధిస్తామని బిల్లులో సవరణ చేసింది ప్రభుత్వం.