అన్ని హద్దులు దాటేశారు..ప్రియాంక, మమతపై సుష్మా ఆగ్రహం...
Recommended Video
ఢిల్లీ : ప్రధాని మోడీని ఉద్దేశించి కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మోడీని దుర్యోధునుడు, అమిత్షాను దుశ్శాసనుడిగా అభివర్ణిస్తూ ఇరువురు నేతలు చేసిన కామెంట్లపై కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ ఘాటుగా స్పందించారు. విమర్శలు చేయడంలో ప్రియాంక, మమతలు అన్ని హద్దులు దాటేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ప్రజాస్వామ్యంతో చెంప పగలగొట్టాలనుంది... మోడీకి మమతాబెనర్జీ వార్నింగ్..
రాహుల్ పెద్ద ఇగోయిస్టు
హర్యానాలో మంగళవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ప్రియాంకగాంధీ ప్రధానిపై ఘాటు విమర్శలు చేశారు. ఆయనను దురహంకారి దుర్యోధనుడితో పోల్చారు. దీనిపై కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. రాహుల్ గాంధీ అహంకారం కారణంగానే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అవమానాల పాలయ్యారని సుష్మా విమర్శించారు. 2013 సెప్టెంబర్లో శిక్షపడిన ప్రజా ప్రతినిధులను అనర్హత నుంచి కాపాడే ఉద్దేశంతో మన్మోహన్ తెచ్చిన ఆర్డినెన్స్ను చించి పారేయాలన్న రాహుల్ వ్యాఖ్యలను ఆమె గుర్తుచేశారు. అలాంటి వారు తమ గురించి మాట్లాడుతున్నారా అని ప్రశ్నించారు.
మోడీ దుర్యోధనుడు, అమిత్ షా దుశ్సాసనుడు
ఇదిలా ఉంటే రాజీవ్గాంధీ అవినీతిపరుడని, బెంగాల్ల్లో ప్రభుత్వం వసూళ్లకు పాల్పడుతోందన్న మోడీ ఆరోపణలపై మమత బెనర్జీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజాస్వామ్యంతో చెంపపెట్టులాంటి సమాధానం ఇవ్వాలని ఉందని అన్నారు. అంతటితో ఆగకుండా మోడీ, అమిత్షాలను మహాభారతంలో పాత్రలతో పోల్చారు. మోడీ దుర్యోధనుడిలా, అమిత్ షా దుశ్శాసనుడిలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు.
కోపాన్ని అదుపులో పెట్టుకోండి
మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన సుష్మా స్వరాజ్ ఇలాంటి కామెంట్లతో ఆమె అన్ని హద్దులు దాటేశారని అభిప్రాయపడ్డారు. తాను ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, మోడీ ప్రధాని అన్న విషయం మమత మర్చిపోతున్నారని అన్నారు. మెరుగైన పాలన అందించడం కోసం భవిష్యత్తులో తామిద్దరూ కలిసి పనిచేయాల్సి వస్తుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని మమతకు సూచించారు. అందుకే కోపాన్ని అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదంటూ సుష్మా స్వరాజ్ ట్వీట్ చేశారు.