ప్రతి 8 గంటలకు స్టెరాయిడ్లు తీసుకునేదాన్ని..ఎందుకో చెప్పిన సుష్మితా సేన్
మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్ స్టెరాయిడ్స్ తీసుకున్నారా..? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. అయితే ఇది చెప్పింది మరెవరో కాదు.. స్వయంగా ఈ బ్యూటీనే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. 2014లో తన ఆరోగ్యం బాగా దెబ్బతినిందని చెప్పిన సుష్మితా సేన్... ఆ సమయంలో ఓ బెంగాలీ సినిమాకోసం షూటింగ్లో పాల్గొన్నట్లు తెలిపారు. షూటింగ్ తర్వాత తను అనారోగ్యానికి గురైనట్లు వెల్లడించారు. పలు పరీక్షలు చేయించినప్పటికీ ఏమి జరిగిందో తెలియలేదని ఒక్కసారిగా కళ్లు తిరిగి పడిపోయినట్లు తెలిపారు. తన అంతర్గత అవయవాలు దెబ్బతిన్నట్లు వైద్యులు ధృవీకరించినట్లు చెప్పింది.
స్టెరాయిడ్లు తీసుకున్నాను..అవి లేకపోతే ప్రాణానికే ప్రమాదం
2014 నుంచి తన శరీర భాగాలు ఒక్కొక్కటిగా ధ్వంసం అవుతూ వచ్చాయని సుష్మితాసేన్ పేర్కొన్నారు. ఇక అప్పటి నుంచి స్టెరాయిడ్లకు అలవాటు పడినట్లు తెలిపింది. ఆ సమయంలో తాను హైడ్రో కార్టిసోన్ అనే స్టెరాయిడ్ను తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొంది. అది కూడా ప్రతి 8 గంటలకు ఒకసారి తీసుకుంటేనే ప్రాణాలతో ఉండగలుగుతున్నట్లు సుష్మితా చెప్పింది. ఇక స్టెరాయిడ్ల వాడకంతో రెండేళ్ల పాటు సైడ్ ఎఫెక్ట్స్తో నరకయాతన పడినట్లు చెప్పింది. పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు, అదికూడా ఒక మాజీ విశ్వసుందరిగా ఉన్న సమయంలో అందంగా కనిపించేందుకు ప్రయత్నించేదాన్నని కానీ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల నరకం అనుభవించేదాన్నని సుష్మితా చెప్పుకొచ్చింది. ఈ స్టెరాయిడ్స్ వాడకం వల్ల తన జుట్టు విపరీతంగా రాలిపోయేదని సుష్మితా చెప్పింది. ముఖంపై ముడతలు కూడా కనిపించేవని ఆసమయంలో చాలా ఇబ్బందులు పడ్డట్లు తెలిపింది. స్టెరాయిడ్లు తీసుకోవడం వల్ల బరువు పెరగడమే కాకుండా ఎముక సాంద్రత కూడా కోల్పోతామని చెప్పిన సుష్మితా రక్తపోటు కూడా అధికంగా ఉంటుందని వెల్లడించింది.
రెండేళ్లు స్టెరాయిడ్లతో నరకం అనుభవించాను
ఇక స్టెరాయిడ్స్ తీసుకునే సమయంలో చాలా అనారోగ్యానికి కూడా గురయ్యేదాన్నని వెల్లడించిన సుష్మితా సేన్.. తను అప్పటికే ఇద్దరి పిల్లలకు తల్లినని వారికి తన అవసరం ఎంతో ఉండేదని గుర్తుకు చేసింది. ఈ స్టెరాయిడ్లతో పిచ్చి పట్టినట్లు ఉండేదని కానీ ప్రాణాలతో ఉండాలంటే అవి తప్పనిసరిగా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు చెప్పింది. 2014 నుంచి 2016లో సుష్మితా సేన్ను చూస్తే తను ఎంతగా ఇబ్బంది పడినేది వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. అయితే ఆ సమయంలో తను ఎన్నో విషయాలను నేర్చుకున్నట్లు సుష్మితా చెప్పింది. చికిత్స కోసం లండన్ జర్మనీకి వెళ్లిన సమయంలో అక్కడి వైద్యులు జీవితాంతం స్టెరాయిడ్లను తీసుకోవాలని సూచించినట్లు సుష్మితా చెప్పింది. అవి తీసుకున్న సమయంలో తన కళ్లు మూసుకుపోయేవని గుర్తు చేసుకుంది సుష్మితా. కంటి చూపు కూడా మందగించేదని చెప్పింది. ప్రతిరోజు 60 మిల్లీగ్రాములు స్టెరాయిడ్ తీసుకునేదాన్నంటూ వెల్లడించింది సుష్మితా సేన్. అది ఒక్కోసారి 100 మిల్లీగ్రాములు కూడా అయ్యేదని గుర్తుచేసుకుంది.
ఎంతవరకు బతికితే అంతవరకే అన్నట్లుగా పోరాడాను
అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారని చెప్పిన సుష్మితా సేన్... అదే సమయంలో ఒత్తిడి ఎక్కువగా ఉండే నటనను వీడాలని తన శరీరం ఒత్తిడి తీసుకునే పరిస్థితుల్లో లేదని వైద్యులు చెప్పినట్లు ఆమె తెలిపింది. ఒత్తిడికి గురవడం వల్ల వెంట్రుకలు రాలిపోతాయని, ముఖం, చర్మం పై ముడతలు వస్తాయని ముందుగానే వైద్యులు హెచ్చరించినట్లు చెప్పిన సుష్మితా.. నటనకు దూరం కాలేనని వీటన్నిటిపై పోరాటం చేస్తానని నిశ్చయించుకున్నట్లు తెలిపింది. ఎంతవరకు రాణించగలుగుతానో అంతవరకు పోరాడుతానే తప్ప వెనక్కు తగ్గేది లేదని ఆనాడు నిర్ణయించుకుని జీవితాన్ని ముందుకు తీసుకెళ్లినట్లు చెప్పింది. అలా ఒక్కొక్కటిగా జయించుకుంటూ ఇప్పుడు పూర్తిగా స్టెరాయిడ్స్కు దూరం అయినట్లు వెల్లడించింది సుష్మితా సేన్.
ఇలా తన జీవితంలో స్టెరాయిడ్స్కు ఎలా అలవాటు పడింది ఆ ఇంటర్వ్యూలో తెలిపింది మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్.