Coronavirus:స్పైస్ జెట్ విమానం ప్రయాణికుడికి కరోనావైరస్ లక్షణాలు
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని కరోనావైరస్ వణికిస్తోందన్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు ఆయా దేశ ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. జపాన్లో లంగరేసి ఉన్న క్రూయిజర్లో ఇప్పటికే కొందరికి కరోనావైరస్ సోకింది. ఇక తాజాగా బ్యాంకాక్ నుంచి ఢిల్లీకి వస్తున్న స్పైస్ జెట్ విమానంలో ఓ ప్రయాణికుడికి కరోనావైరస్ లక్షణాలు కనిపించడంతో విమానం ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవగానే అతన్ని ఐసొలేషన్ ప్రాంతానికి తరలించారు.
బ్యాంకాక్ నుంచి ఢిల్లీకి వస్తున్న స్పైస్ జెట్ విమానం ఎస్జీ 88లో ప్రయాణికుడు 31 ఎఫ్ సీటులో కూర్చున్నాడు. అయితే ఆ వరస మొత్తం ఖాళీగానే ఉన్నింది. ఆ వ్యక్తి మాత్రమే కూర్చున్నాడు. విమానం ల్యాండ్ అవగానే కరోనావైరస్ లక్షణాలు ఉన్న వ్యక్తిని ఎయిర్పోర్ట్ హెల్త్ ఆర్గనైజేషన్ అధికారులు నిర్బంధించారని స్పైస్ జెట్ ప్రతినిధి ఒకరు చెప్పారు. కోల్కతాలో మరో ఇద్దరిలో కూడా కరోనా వైరస్ లక్షణాలు కనిపించినట్లు అధికారులు తెలిపారు. వీరిద్దరూ కోల్కతా ఎయిర్పోర్టులో ల్యాండ్ అయినట్లు అధికారులు తెలిపారు. థర్మల్ స్క్రీనింగ్ సందర్భంగా వారిలో లక్షణాలు కనిపించినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు.
ఇక కేరళలో కూడా ఇద్దరి వ్యక్తులకు కరోనావైరస్ టెస్టులు నిర్వహించగా పాజిటివ్గా తేలింది. వీరిద్దరూ ఈ మధ్యనే చైనాలోని వూహాన్ నగరం నుంచి కేరళకు వచ్చారు. ఇప్పటి వరకు భారతదేశంలో మొత్తం 2 లక్షల మంది ప్రయాణికులకు కరోనావైరస్ టెస్టులు నిర్వహించడం జరిగిందని అధికారులు చెప్పారు. 1,818 విమానాల్లో ప్రయాణిస్తున్న 1.97 లక్షల మంది ప్రయాణికులకు కరోనావైరస్ స్క్రీనింగ్ జరిగినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్ష వర్థన్ చెప్పారు. అంతేకాదు ఈ మహమ్మారిపై పోరుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వివరించారు.
ఇక కరోనావైరస్ స్క్రీనింగ్ కేంద్రాలను 12 ప్రధాన నౌకాశ్రయాల్లో ఏర్పాటు చేసినట్లు చెప్పిన మంత్రి హర్షవర్ధన్... ఈ పోర్టులకు చైనా నుంచి చేరుకుంటున్న ప్రయాణికులకు టెస్టులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. లక్షణాలు ఏమైనా కనిపిస్తే వెంటనే వారిని ఐసొలేషన్ సెంటర్లకు తరలిస్తున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉంటే చైనాలో 1300 మంది కరోనావైరస్ బారిన పడి మృతి చెందారు. మరో 15,152 కొత్త కరోనా కేసులు వచ్చినట్లు అధికారులు నిర్థారించారు. దీంతో వైరస్ బారిన పడిన వారి సంఖ్య 59,805కు చేరుకుంది.