వైద్యుడు అంటూ హల్ చల్, కాశ్మీరీ అరెస్టు, రంగంలోకి ఐబీ, రా అధికారులు, ఉగ్రవాది ?
బెంగళూరు: భారత్ లో ఉగ్రవాదులు చొరబడ్డారని ఇంటెలిజెన్స్ అధికారులు హెచ్చరించడంతో దేశ వ్యాప్తంగా పోలీసులు అలర్ట్ అయ్యారు. తాను వైద్యుడు అంటూ అనుమానాస్పదంగా హల్ చల్ చేసిన వ్యక్తిని కర్ణాటకలోని మంగళూరు నగరంలో పోలీసు అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకుని రంగంలోకి దిగిన ఇంటిలిజెన్స్, రా అధికారులు అనుమానిత కాశ్మీరీని రహస్య ప్రాంతంలో విచారణ చేస్తున్నారు.
మంగళూరు ట్రాఫిక్ పోలీసులు అనుమానంతో లాల్ బాగ్ సమీపంలో డబ్లూ హెచ్ఓ అనే నెంబర్ బోర్డు ఉన్న కారును నిలిపి అందులోని వ్యక్తిని విచారణ చేశారు. తాను వైద్యుడు, పని మీద వెలుతున్నానని పోలీసులకు సమాధానం ఇచ్చాడు. ట్రాఫిక్ పోలీసులకు అనుమానం వచ్చి వెంటనే పై పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చారు.
పోలీసు అధికారులు అతన్ని విచారణ చెయ్యగా తాను ముంబై నుంచి వచ్చానని ఒక సారి, కాదు హైదరాబాద్ నుంచి వచ్చానని మరోసారి పోలీసులకు తికమక సమాధానాలు చెప్పాడు. పోలీసుల విచారణలో అతను అసలు వైద్యుడు కాదని వెలుగు చూసింది.
అనుమానితుడిని పోలీసు అధికారులు తీవ్రస్థాయిలో విచారణ చెయ్యగా అతను కాశ్మీరీ అని వెలుగు చూసింది. విషయం తెలిసిన వెంటనే కేంద్ర ఇంటిలిజెన్స్ విభాగం అధికారులు, రా అధికారులు మంగళూరు చేరుకుని కాశ్మీరీని రహస్య ప్రాంతంలో విచారణ చేస్తున్నారు. అధికారులు విచారణ చేస్తున్న కాశ్మీరీ వ్యక్తి వివరాలు చెప్పడానికి మంగళూరు పోలీసు అధికారులు నిరాకరించారు.
శ్రీలంక నుంచి సముద్ర మార్గంలో ఉగ్రవాదులు తమిళనాడులో చొరబడ్డారని, దాడులు చెయ్యడానికి కుట్రపన్నారని ఇంటిలిజెన్స్ అధికారులు ఇటీవల హెచ్చరించారు. కర్ణాటకలోని సముద్ర తీర ప్రాంతం (మంగళూరు)లో అనుమానిత కాశ్మీర్ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో స్థానిక ప్రజలు ఆందోళనకు గురైనారు.