కలకలం: ఢిల్లీ విమానాశ్రయం వద్ద ఉగ్రవాది అరెస్ట్
న్యూఢిల్లీ: గణతంత్ర వేడుకలకు సిద్ధమవుతున్న తరుణంలో దేశ రాజధానిలో లష్కరే తోయిబా ఉగ్రవాది కలకలం సృష్టించాడు. గుజరాత్ యాంటీ-టెర్రరిస్టు స్క్వాడ్ (ఏటీఎస్), ఢిల్లీ పోలీస్ సంయుక్తంగా బుధవారం నిర్వహించిన ఆపరేషన్ లో వాంటెడ్ ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నట్టు ఓ సీనియర్ అధికారి తెలిపారు.
ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయం వద్ద ఆ ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టుబడ్డ ఉగ్రవాది పేరు బిలాల్ అహ్మద్ కావా. 2000 సంవత్సరంలో రెడ్ ఫోర్ట్ వద్ద 'లష్కరే' చేసిన దాడిలో బిలాల్ అహ్మద్ ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
కాగా, ఢిల్లీలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించే నిమిత్తం ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి పలువురు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, తనిఖీలు ముమ్మరం చేశారు.