మళ్లీ వార్తల్లోకి ఎక్కిన స్వామి చిన్మయానంద్: న్యాయ విద్యార్థినిని నిర్బంధించి, అత్యాచారం కేసులో..!
లక్నో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నవ్ అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు, కేంద్ర మాజీమంత్రి స్వామి చిన్మయానంద్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. న్యాయ విద్యార్థినిని నిర్బంధించి ఏడాది కాలం పాటు అత్యాచారం చేసిన కేసులో జైలు శిక్షను అనుభవిస్తోన్న ఆయనకు బెయిల్ మంజూరైంది. ఉత్తర ప్రదేశ్లోని అలహాబాద్ హైకోర్టు ఆయనకు బెయిల్ను మంజూరు చేసింది. ఈ మేరకు సోమవారం ఆదేశాలను జారీ చేసింది.
ఉత్తర్ ప్రదేశ్లోని ఉన్నవ్కు చెందిన స్వామి చిన్మయానంద్..న్యాయ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ప్రస్తుతం ఆయన కారాగార శిక్షను అనుభవిస్తున్నారు. ఈ కేసులో ఆయనపై నమోదైన ఆరోపణలన్నీ సాక్ష్యాధారాలతో సహా నిరూపితమయ్యాయి. ఉత్తర ప్రదేశ్ షాజహాన్పూర్లోని ఎస్ఎస్ న్యాయ కళాశాల డైరెక్టర్గా వ్యవహరించిన సమయంలో చిన్మయానంద్.. తనను నిర్బంధించి, పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు అదే కళాశాలకు చెందిన బాధిత విద్యార్థిని వెల్లడించిన విషయం తెలిసిందే.
ఈ విషయాన్ని బాహ్య ప్రపంచానికి తెలియజేస్తే.. హత్య చేస్తారనే భయంతో ఆమె కొన్ని రోజులు అదృశ్యం అయ్యారు. ఓ వీడియో ద్వారా ఈ దురాగతాన్ని వెల్లడించారు. అప్పటి నుంచీ ఈ కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ కేసులో చిన్మయానంద్పై సెక్షన్ 376 సీ, సెక్షన్ 354 డీ, సెక్షన్ 342, సెక్షన్ 506 కింద కేసులు నమోదయ్యాయి. ఈ ఘటన తరువాత భారతీయ జనతా పార్టీ ఆయనపై చర్యలు తీసుకుంది. పార్టీ నుంచి బహిష్కరించింది.
ఈ కేసును దర్యాప్తు చేయడానికి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఆయనపై వచ్చిన ఆరోపణలన్నీ రుజువు కావడంతో న్యాయస్థానం గత ఏడాది నవంబర్లో జైలు శిక్ష విధించింది. అప్పటి నుంచి ఆయన అలహాబాద్ కేంద్ర కారాగారంలో శిక్షను అనుభవిస్తున్నారు. తాజాగా ఆయనకు బెయిల్ మంజూరైంది. చిన్మయానంద్కు బెయిల్ రావడం పట్ల అత్యాచార బాధితురాలి కుటుంబం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీన్ని సవాల్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.