ఉగ్రవాదులకు సహకారం: ఎన్ఐఏ కస్టడీకి సస్పెండైన డీఎస్పీ దవీందర్ సింగ్
Recommended Video
శ్రీనగర్: ఉగ్రవాదులకు సహాయ సహకారాలు అందజేస్తూ దొరికిపోయిన జమ్మూకాశ్మీర్ డీఎస్పీ దవీందర్ సహా నలుగురిని ప్రత్యేక కోర్టు ఎన్ఐఏ కస్టడీకి అప్పగించింది. 15 రోజుల కస్టడీకి అనుమతించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. సస్పెండైన డీఎస్పీ దవీందర్ తోపాటు ఇద్దరు ఉగ్రవాదులు, మరో ఇద్దరు అనుచరులను గురువారం ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు.
విచారణ నిమిత్తం 15 రోజుల కస్టడీకి ఎన్ఐఏ అనుమతి కోరగా.. అందుకు న్యాయస్థానం సమ్మతించింది. కాగా, అంతకుముందు బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో నిందితులను కోర్టులో ప్రవేశపెట్టారు.
కాగా, 25 ఏళ్లుగా కశ్మీర్లో పోలీస్ విధులు నిర్వర్తిస్తున్న దవీందర్ సింగ్పై తొలి నుంచే పలు ఆరోపణలున్నాయి. తొలినాళ్లలో ఓ డ్రగ్స్ లారీని పట్టుకున్న దవీందర్.. అందులోని సరుకును తానే అమ్ముకున్నాడు. విచారణలో నిజం తేలినప్పటికీ.. అప్పట్లో సస్పెన్షన్ వేటుతో సరిపెట్టారు. ఉగ్రవాదులకు సాయం చేస్తూ కశ్మీర్లో పౌరులను హింసిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు.
2004లో తీహార్ జైలు నుంచి ఉగ్రవాది అప్జల్ గురు తన లాయర్కు రాసిన లేఖలో దవీందర్ సింగ్ గురించి ప్రస్తావించాడు. పార్లమెంటుపై దాడికి కొన్ని నెలల ముందు దవీందర్ తనను అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టినట్టు అఫ్జల్ గురు అందులో తెలిపాడు. తాను ఢిల్లీకి పంపించే ఓ వ్యక్తికి ఎక్కడైనా ఆశ్రయం ఇప్పించాలని ఒత్తిడి చేసినట్టు చెప్పాడు.
2001లో పార్లమెంటుపై దాడి సమయంలో పోలీసుల కాల్పుల్లో చనిపోయిన వ్యక్తే.. దవీందర్ పంపించిన వ్యక్తి అని పేర్కొన్నాడు.కాగా,దవీందర్ సింగ్కు గతంలో రాష్ట్రపతి పోలీసు పతకంతో పాటు పలు అవార్డులు రావడం గమనార్హం. అతనిపై ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు వాటిని రద్దు చేస్తున్నట్లు అధికారులు ఇప్పటికే ప్రకటించారు.