Punjab: అంబికా సోని ట్విస్ట్-అధిష్ఠానం నిర్ణయానికే సవాల్-కాంగ్రెస్ ఆ ఫార్ములాతో ముందుకెళ్లే ఛాన్స్...
పంజాబ్ కొత్త ముఖ్యమంత్రి ఎవరనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. సిక్కు వర్గానికి చెందిన నేతకే మళ్లీ అవకాశం దక్కుతుందా.. లేక నాన్ సిక్కు వర్గానికి చెందిన నేతను పదవి వరిస్తుందా అన్న చర్చ జరుగుతోంది.నాన్ సిక్కు వర్గానికే పదవిని కట్టబెట్టాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే సీనియర్ నేత,రాజ్యసభ సభ్యురాలు అంబికా సోనికి ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేసింది. అయితే అబింకా సోని ఆ ఆఫర్ను తిరస్కరించడమే కాదు.. పంజాబ్ ముఖ్యమంత్రిగా సిక్కు వర్గానికి చెందిన నేతనే ఉండాలని అభిప్రాయపడ్డారు.ముఖ్యమంత్రి పదవికి సంబంధించి తన అంతరంగాన్ని తాను ఫాలో కావాల్సిందేనని పేర్కొన్నారు.
అధిష్ఠానం నిర్ణయాన్ని సవాల్ చేసిన అంబికా సోని...
నాన్ సిక్కు వర్గానికి చెందిన నేతను ముఖ్యమంత్రిని చేయాలని భావిస్తున్న కాంగ్రెస్...అందుకు అనుగుణంగానే అంబికా సోనికి పదవి కట్టబెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు అంబికా సోనితో సంప్రదింపులు జరపగా... ఆమె నుంచి ఊహించని సమాధానం ఎదురైనట్లయింది. పంజాబ్కు సిక్కు ముఖ్యమంత్రే ఉండాలని ఆమె బలంగా చెబుతున్నారు.ముఖ్యమంత్రి పదవిని తిరస్కరించడం వరకు ఓకె గానీ... సిక్కు వర్గానికి చెందిన నేతకే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని ఆమె వాదిస్తుండటం పార్టీలో కొత్త చర్చకు దారితీసింది. ఒకరకంగా పార్టీ నిర్ణయాన్ని ఆమె సవాల్ చేసినట్లయింది.మున్ముందు సిక్కు నేతలు కూడా ఇదే డిమాండ్ చేస్తే కాంగ్రెస్ ఇరకాటంలో పడక తప్పదు.
ఆ ఫార్ములతా ముందుకెళ్లే ఛాన్స్...
'ముఖ్యమంత్రి పదవిని హిందూ వర్గానికి చెందిన నేతకు కట్టబెట్టి... ఇద్దరు డిప్యూటీ సీఎంలలో ఒకరిని సిక్కు వర్గం నుంచి మరొకరి నుంచి దళిత వర్గం నుంచి తీసుకునే అవకాశం ఉంది.' అని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు హిందూ-నాన్ సిక్కు కాంబినేషన్లో సమాయత్తం కావాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇప్పటికే నవజోత్ సింగ్ సిద్దూ పీసీసీ చీఫ్గా ఉండటంతో... ముఖ్యమంత్రి పదవిని నాన్ సిక్కు వర్గానికి కట్టబెట్టే యోచనలో ఉంది. సీఎం రేసులో అంబికా సోనీ పక్కకు తప్పుకోవడంతో... సునీల్ కుమార్ జఖర్,ప్రతాప్ బజ్వా,సుఖ్జీందర్ రంద్వా,సుఖ్బీర్ సింగ్ సకారియా,త్రిప్త్ రజీందర్ సింగ్ బజ్వా,బ్రహ్మ్ మొహీంద్ర,విజయందర్ సింగ్లా,పంజాబ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కులజీత్ సింగ్,ఎంపీ ప్రతాప్ సింగ్ బజ్వా తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి.
అంతిమ నిర్ణయం సోనియాదే...
పంజాబ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పవన్ గోయెల్ మాట్లాడుతూ... కొత్త ముఖ్యమంత్రి ఎవరనేది కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నిర్ణయిస్తుందన్నారు. 'నిన్న కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి హరీశ్ రావత్తో కాంగ్రెస్ ఎమ్మెల్యేల భేటీ జరిగింది. ఎమ్మెల్యేలంతా తమ అభిప్రాయాలను సోనియా గాంధీకి పంపించారు.అంతిమ నిర్ణయం సోనియా గాంధీ తీసుకుంటారు.ఆ నిర్ణయమేంటనేది ఇవాళ మీకు తెలుస్తుంది.' అని పేర్కొన్నారు. శనివారం నాటి సీఎల్పీ సమావేశంలో తదుపరి ముఖ్యమంత్రి ఎంపిక బాధ్యతలను సోనియా గాంధీ నిర్ణయానికే వదిలేస్తూ ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవ తీర్మానం చేశారు.
వాయిదాపడ్డ సీఎల్పీ భేటీ...
ఆదివారం(సెప్టెంబర్ 19) ఉదయం 11గంటలకు జరగాల్సిన సీఎల్పీ సమావేశం వాయిదా పడింది. సీఎల్పీ నేత ఎంపికపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో సమావేశం వాయిదాపడినట్లు తెలుస్తోంది.తదుపరి సమావేశం ఎప్పుడనేది ఇంకా పార్టీ వర్గాలు వెల్లడించలేదు. నిజానికి నిన్నటి సమావేశంలోనే ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాలను వెల్లడించారని... మరోసారి సీఎల్పీ సమావేశం నిర్వహించాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే పర్గత్ సింగ్ పేర్కొనడం గమనార్హం.ప్రస్తుత పరిణామాలు గమనిస్తుంటే... ముఖ్యమంత్రి ఎంపిక ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
ఫలించని కాంగ్రెస్ నిర్ణయం...
అంబికా సోని ముఖ్యమంత్రి పదవిని తిరస్కరించడంతో కాంగ్రెస్ మరో నేతను అందుకు ఎంపిక చేసే పనిలో నిమగ్నమైంది. నిజానికి అంబికా సోని అయితేనే అందరినీ కలుపుకుపోగలరని... పార్టీ శ్రేణులంతా ఆమె నాయకత్వంలో కలిసికట్టుగా పనిచేస్తాయని కాంగ్రెస్ అధిష్ఠానం భావించింది.గాంధీ కుటుంబానికి విధేయురాలిగా,సీనియర్ నేతగా అంబికా సోనికి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ఉన్నది.1969లో ఇందిరా గాంధీ ఆమెను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు.ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న అంబికా గతంలోనూ పలుమార్లు ఎంపీగా పనిచేశారు.శనివారం రాత్రి అంబికా సోనితో కాంగ్రెస్ అధిష్ఠానం సంప్రదింపులు జరిపినట్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పదవిని అంబికాకు ఆఫర్ చేయగా ఆమె తిరస్కరించారు.
సిద్దూకి వ్యతిరేకంగా అమరీందర్...
అనూహ్య పరిణామాల నడుమ కెప్టెన్ అమరీంద్ సింగ్ ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేయక తప్పలేదు.రోజురోజుకు పార్టీలో తన వ్యతిరేక వర్గం అధిష్ఠానంపై ఒత్తిడి పెంచుతుండటంతో అమరీందర్ రాజీనామా చేశారు. తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేది సోనియా నిర్ణయిస్తారని... అయితే నవజోత్ సింగ్ సిద్దూని అందుకు ఎంపిక చేయాలనుకుంటే మాత్రం తాను వ్యతిరేకిస్తానని పేర్కొన్నారు.సిద్దూపై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. సిద్దూకు పాకిస్తాన్ ప్రధాని,ఆర్మీ చీఫ్లతో ఉన్న సంబంధాల రీత్యా.. ఆయన్ను సీఎంగా చేయడం దేశభద్రతకు ముప్పు అని వ్యాఖ్యానించారు. సిద్దూను సీఎంగా చేయాలనుకునే ఏ చర్యనైనా తాను వ్యతిరేకిస్తానని స్పష్టం చేశారు.
అమరీందర్ రాజీనామా వెనక...
పంజాబ్ పీసీసీ పగ్గాలు నవజోత్ సింగ్ సిద్దూకి అప్పగించడంపై అమరీందర్ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మాటను లెక్క చేయకుండా సిద్దూకి పదవి కట్టబెట్టడంపై అమరీందర్ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. సిద్దూ,అమరీందర్ మధ్య చాలాకాలం పాటు కోల్డ్ వార్ నడిచింది.దీంతో ఇద్దరినీ ఢిల్లీకి పిలిచి సయోధ్య కుదిర్చే ప్రయత్నం జరిగింది.అయితేఇటీవల ఈ కోల్డ్వార్ సద్దుమణిగినట్లు కనిపించినప్పటికీ... తాజా పరిస్థితులు గమనిస్తుంటే ఇరువురి మధ్య గ్యాప్ ఇంకా కొనసాగుతున్నట్లుగానే ఉంది. సిద్దూ ప్రోద్బలంతోనే అమరీందర్ సింగ్ వ్యతిరేక వర్గం ఆయనపై తిరుగుబాటు చేస్తూ వస్తోందనే వాదన ఉంది.తాజాగా అమరీందర్ వ్యతిరేక వర్గం అధిష్ఠానానికి లేఖ రాయడం వెనుక కూడా సిద్దూ హస్తం ఉందనే వాదన లేకపోలేదు.
అటు అమరీందర్ సింగ్ కూడా అధిష్టానం తన ప్రాధాన్యతను తగ్గిస్తూ వస్తోందనే భావనలోనే ఉన్నారు.ఇంత ఒత్తిడి నడుమ సీఎంగా కొనసాగడం కంటే రాజీనామా చేయడమే ఉత్తమమని ఆయన భావించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన రాజీనామా చేసినట్లు చెబుతున్నారు.ఏదేమైనా ఎన్నికలకు కొద్ది నెలలు ముందు జరుగుతున్న ఈ కీలక మార్పులు పార్టీకి మేలు చేస్తాయో,చేటు చేస్తాయో వేచి చూడాలి.