కేంద్ర మాజీ మంత్రి మణిశంకర్ అయ్యర్పై సస్పెన్షన్ ఎత్తివేత
ఢిల్లీ: సీనియర్ రాజకీయనేత కేంద్ర మాజీ మంత్రి మణిశంకర్ అయ్యర్ పై సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లు ఆ పార్టీ కార్యాలయం జనరల్ సెక్రటరీ అశోక్ గెహ్లాట్ లేఖను విడుదల చేశారు. తక్షణమే ఆయన కాంగ్రెస్ సభ్యుని గుర్తిస్తున్నట్లు గెహ్లాట్ చెప్పారు. మణిశంకర్ అయ్యర్పై సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ గత కొద్ది రోజులుగా డిసిప్లినరీ కమిటీకి చాలామంది నేతలు చెప్పారని...దీంతో కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ మణిశంకర్ అయ్యర్ పై సస్పెన్షన్ ఎత్తివేసేందుకు అంగీకరించారని గెహ్లాట్ తెలిపారు.
గతేడాది డిసెంబర్ 7న ప్రధాని నరేంద్ర మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ఈ 77ఏళ్ల మణిశంకర్ అయ్యర్పై కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తూ ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. మోడీ అధమ స్థాయి జీవితం నుంచి వచ్చాడంటూ వివాదాస్పద వ్యాఖ్యలు మణిశంకర్ అయ్యర్ చేశారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ కాంగ్రెస్ అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడిచిందని చెప్పారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ మణిశంకర్ అయ్యర్ మోడీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
అయ్యర్ చేసిన వ్యాఖ్యలు నాటి గుజరాత్ ఎన్నికలపై ప్రభావం చూపుతాయని భావించిన కాంగ్రెస్ ఆయన్ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీచేసింది. ఆ సమయంలో రాహుల్ గాంధీ గుజరాత్లో ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ తన తప్పు తెలుసుకుని మళ్లీ తనను పార్టీలోకి తప్పక తీసుకుంటుందని ఈ ఏడాది జనవరిలోనే మణిశంకర్ అయ్యర్ చెప్పారు. అయితే అది ఆరు రోజుల్లో కావొచ్చు, ఆరు నెలల్లో కావొచ్చు, లేదా ఆరు సంవత్సరాల సమయం పట్టొచ్చన్నారు. మణిశంకర్ అయ్యర్ ఆనాడు చెప్పిన జోస్యం ఇప్పుడు నిజమైంది. తనను తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తిరిగి తీసుకుంటుందని చెప్పిన ఏడునెలలకే హస్తం పార్టీ అయ్యర్పై సస్పెన్షన్ ఎత్తివేసింది.