Indian Railways:అప్పటి వరకు అన్ని ప్యాసింజర్ రైళ్లు రద్దు..రైల్వేశాఖ కీలక ప్రకటన
ముంబై: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసిన రైల్వేశాఖ తాజాగా ఈ రైళ్ల రాకపోకలను సెప్టెంబర్ 30వరకు రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో రైళ్ల రద్దు పొడిగింపు నిర్ణయం తీసుకున్నట్లు రైల్వేశాఖ పేర్కొంది. ఇదిలా ఉంటే రెగ్యులర్ ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసినప్పటికీ గూడ్సు, మరియు ఇతర ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైళ్లు మాత్రం తిరుగుతాయని రైల్వేశాఖ స్పష్టం చేసింది. అది కూడా ముందుగా షెడ్యూల్ చేసిన ప్రకారమే ఈ రైళ్లు నడుస్తాయని వెల్లడించింది.
Recommended Video
ఇదిలా ఉంటే ముంబైలో అత్యవసర సేవల్లో పనిచేసే వారి సౌలభ్యం కోసం ఇప్పటికే ప్రారంభించిన సబర్బన్ ట్రైన్స్ ఎప్పటిలాగే నడుస్తాయని స్పష్టం చేసింది.అంతకుముందు ఆగష్టు 12 వరకు ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. గణేష్ చతుర్థి ముందు తీసుకున్న ఈ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపబోదని రైల్వేశాఖ తెలిపింది. రోజూ ఛత్రపతి శివాజీ టెర్మినస్ నుంచి రెండు ప్రత్యేక రైళ్లు లోకమాన్య తిలక్ టర్మినస్ నుంచి మరో రెండు ప్రత్యేక రైళ్లు నడుపుతుందని ప్రకటించింది.
ఇక ప్యాసింజర్ రైళ్లు రద్దు చేసిన సమయంలో వెస్ట్రన్ రైల్వేలు ముంబై సెంట్రల్ మరియు బాంద్రా టర్మినస్ నుంచి వారంలో ఐదు రైళ్లను నడపనుంది. లాక్డౌన్ విధించిన తర్వాత ఈ రూట్లలో రైళ్లను తొలిసారిగా నడపనుండటం విశేషం. మొత్తానికి కరోనావైరస్ విజృంభిస్తుండటంతో రైల్వేశాఖ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. లాక్డౌన్ సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో ఇరుక్కుపోయిన వలస కూలీలను తమ సొంత రాష్ట్రాలకు చేరవేసేందుకు శ్రామిక్ ఎక్స్ప్రెస్ పేరుతో ప్రత్యేక రైళ్లను నడిపింది రైల్వే శాఖ.