కేంద్రం క్లారిటీ ఇచ్చినా లాక్ డౌన్ ఎత్తివేతపై అనుమానాలు: రీజన్ ఇదే
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న నేపధ్యంలో ఈ వైరస్ ను కట్టడి చెయ్యటానికి చాలా దేశాలు లాక్ డౌన్ ప్రకటించాయి. ఇక భారత్ పైన కూడా పంజా విసిరిన ఈ మహమ్మారి నుండి భారత దేశ ప్రజలను కాపాడుకోవటం కోసం ప్రధాని మోడీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు.ప్రధాని మోదీ ఇప్పటికే భారతదేశ వ్యాప్తంగా 21 రోజులు లాక్డౌన్ ప్రకటించారు. ఇప్పటికే ఇబ్బంది పడుతున్న ప్రజలు లాక్ డౌన్ విషయంలో పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ నేపధ్యంలో కేంద్రం కూడా స్పందించింది . లాక్ డౌన్ పొడిగింపు వార్తలను కొట్టిపారేసింది. అయినప్పటికీ ప్రజల్లో ఎన్నో అనుమానాలు .
Recommended Video
కరోనా వైరస్: ఏపీలో కూడా ముగ్గురి మృతి..? భార్య, భర్త సహా వృద్దుడు, ఇతర కారణాల వల్లేనని..?
కరోనా కట్టడికి ఏప్రిల్ 15 వరకూ లాక్ డౌన్
కరోనా వైరస్ కేసులు దేశంలో పెరుగుతున్న నేపధ్యంలో ఏప్రిల్ 15 వరకూ లాక్ డౌన్ ప్రకటించింది సర్కార్ . ఇంటి నుంచి బయటకు రావడానికి వీలు లేదని , బస్సులు, రైళ్లు, విమాన సర్వీసులను ఇప్పటికే బంద్ చేసింది. ఇక కరోనా వైరస్కి అడ్డుకట్ట వేయడానికి ఇదే మంచి మార్గమని, దీంతో అందరూ ఇళ్లకే పరిమితమవుతారు కాబట్టి వైరస్ తక్కువగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందని మోదీ అభిప్రాయ పడ్డారు. అంతేకాదు ఎక్కడి ప్రజలు అక్కడే ఉండాలని పేర్కొన్న సర్కార్ ప్రజలను ఈ కష్టకాలంలో ఆదుకోటానికి ప్యాకేజ్ ను కూడా ప్రకటించింది .
లాక్డౌన్ పొడిగించే ఆలోచనేమీ లేదని కేంద్రం స్పష్టం
దేశంలో కరోనా కేసులు బాగా పెరిగితే పరిస్థితి అదుపులోకి రాకుంటే లాక్ డౌన్ పెంచే అవకాశాలు కూడా ఉన్నాయని పెద్ద ఎక్కున ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో కేంద్రం స్పందించింది . లాక్డౌన్ పొడిగింపుపై వస్తున్న ఊహాగానాలను కేంద్ర ప్రభుత్వం కొట్టిపారేసింది. మీడియాతోపాటు సోషల్మీడియాలో లాక్డౌన్ పొడిగిస్తారంటూ వస్తున్న వార్తలన్నీ ఊహాగానాలేనని కేంద్ర కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా స్పష్టం చేశారు. ఇప్పటికైతే లాక్డౌన్ పొడిగించే ఆలోచనేమీ లేదని వివరణ ఇచ్చారు. కానీ పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు .
లాక్ డౌన్ ఎత్తివేస్తే మూడు నెలల మారటోరియం ఎందుకు ?
కేంద్రం క్లారిటీ ఇచ్చినప్పటికీ ప్రజల్లో లాక్ డౌన్ కొనసాగుతుంది అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకు కారణం లేకపోలేదు .అన్ని లోన్లపైనా ఆర్బీఐ 3 నెలలపాటు మారటోరియం విధించడం ఇందులో భాగమేనని కొందరు భావిస్తున్నారు. ఒకవేళ 21 రోజులపాటు మాత్రమే లాక్డౌన్ అమలు చేయాలనుకుంటే 3 నెలల మారటోరియం విధించాల్సిన అవసరం ఏముంటుందని కొందరు ప్రశ్నిస్తున్నారు.
మూడు నెలల మారటోరియంఫై భిన్నాభిప్రాయాలు
ఇక అంతేకాదు మూడు నెలల కరెంట్ బిల్లులు కూడా కట్టవలసిన అవసరం లేదని చెప్పటం కూడా అందుకు ఊతం ఇస్తుంది. ఒకేసారి 3 నెలల లాక్డౌన్ అంటే ప్రజలు భయపడతారన్న భావనతోనే మొదటి దశలో 21 రోజులు విధించిందని పరిస్థితి కంట్రోల్ లోకి రాకుంటే ఇది మళ్లీ పొడిగిస్తారనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. అందుకే కేంద్రం క్లారిటీ ఇచ్చినా సరే ప్రజలు మాత్రం లాక్ డౌన్ పొడిగిస్తారని అనుమానిస్తున్నారు. మూడు నెలలపాటు మారటోరియం అందుకే అంటున్నారు .అయితే లాక్ డౌన్ నేపధ్యంలో ప్రజలు ఎలాంటి సంపాదన లేకుండా ఇళ్లకే పరిమితం అయ్యి ఉంటారు కాబట్టి ఆర్ధికంగా వెనుకబడతారు అన్న భావనలో మూడు నెలల పాటు ఇబ్బంది పెట్టకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా కొందరు భావిస్తున్నారు.