ఎయిర్ పోర్టులో డ్రోన్ చక్కర్లు: పట్టిస్తే రూ. లక్ష
న్యూఢిల్లీ: ఢిల్లీ విమానాశ్రయంలో అనుమానాస్పదంగా పలు సార్లు చెక్కర్లు కొట్టి మాయం అయిన డ్రోన్ వివరాలు తెలుసుకునేందుకు అధికారులు నానా తంటాలు పడుతున్నారు. ఎలాగైనా ఆ డ్రోన్ ను గుర్తించాలని ప్రయత్నిస్తున్నారు.
డ్రోన్ వివరాలు వెల్లడించిన వారికి రూ. ఒక లక్ష బహుమతిగా ఇస్తామని శుక్రవారం ఢిల్లీ పోలీసు అధికారులు ప్రకటించారు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో నాలుగైదు సార్లు డ్రోన్ సంచరించినట్లు అధికారులు గుర్తించారు.
డ్రోన్ సంచరించడం పలు అనుమానాలు రేకెత్తించింది. ఏవియేషన్ నిబంధనల ప్రకారం అది చట్టవ్యతిరేక చర్య కావడంతో అధికారులు దానిని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇటీవల కాలంలో ఉగ్రవాదులు ఎక్కువగా డ్రోన్ల సహాయంతోనే రెక్కి నిర్వహిస్తున్నారని అధికారులు గుర్తించారు.
అయితే పోలీసులు కేసు నమోదు చేసి డ్రోన్ గురించి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఇప్పటి వరకూ ఒక్క క్లూ చిక్కకపోవడంతో ప్రజల సహాయం అడుగుతున్నారు. నూతన సంవత్సర వేడుకల సందర్బంగా ఉగ్రవాదులు దాడులు చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారని అధికారులు గుర్తించారు.
ఇప్పటికే ఢిల్లీ, ఒడిశా, ఉత్తరప్రదేశ్ లలో ఆల్ ఖైదా ఉగ్రవాదులను అరెస్టు చేశారు. ఇప్పుడు విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో సంచరించిన డ్రోన్ కోసం పోలీసు అధికారులు గాలిస్తున్నారు. డ్రోన్ ను పట్టించినా, సమాచారం ఇచ్చినా రూ. ఒక లక్ష బహుమానం అంధిస్తామని అధికారులు తెలిపారు.