ప్రజ్ఞా ఠాకూర్కి అనుమానాస్పద లేఖ, లెటర్పై పౌడర్, రంగంలోకి ఎఫ్ఎస్ఎల్..
బీజేపీ వివాదాస్పద నేత, భోపాల్ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ నివాసానికి కొందరు లేఖను పంపించారు. అయితే లేఖ ఉర్దూలో రాసి ఉండటం, దానిపై పౌడర్ రాసి ఉండటం అనుమానం కలిగిస్తోంది. వెంటనే ప్రజ్ఞా ఠాకూర్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో సీనియర్ అధికారులు లేఖను పరిశీలన నిమిత్తం ఫోరెన్సిక్ సిబ్బందికి పంపించారు.
లేఖలో పంపించిన పత్రాల్లో ప్రజ్ఞా ఠాకూర్ సహా ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ కూడా ఉన్నారు. వారి ఫోటోలపై 'ఇంటు' మార్క్ పెట్టడంపై అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. లేఖ పంపించిది ఉగ్రవాదులేనా అని సస్పెక్ట్ చేస్తున్నారు. లేఖపై ప్రజ్ఞా ఠాకూర్ స్పందిస్తూ.. లేఖను పంపించింది ఉగ్రవాదులేనని తెలిపారు. కానీ తాను ఉగ్రవాదుల చర్యకు భయపడబోనని తేల్చిచెప్పారు. ప్రజ్ఞా ఠాకూర్ లేఖపై పోలీసులు ఐపీసీ 326, 507 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.