బ్రేకింగ్: ముఖేశ్ అంబానీ ఇంటి బయట జిలేటిన్ స్టిక్స్.. రంగంలోకి క్రైం బ్రాంచ్
ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాలను పోలీసులు గుర్తించారు. అంబానీ నివాసం ఆంటియాలా బయట ఓ కారులో జిలెటిన్ స్టిక్స్ గుర్తించారు. వెంటనే పోలీసులు పెద్దార్ రోడ్పై ఉన్న వాహనాన్ని తనిఖీ చేశారు. వెంటనే ఘటనాస్థలానికి పోలీసులు చేరుకొని.. కారును పూర్తిగా పరిశీలించారు.
కారులో 20 జిలెటిన్ స్టిక్స్ ఉన్నాయని సీనియర్ పోలీస్ అధికారి మీడియాకు తెలిపారు. కారులో జిలెటిన్ స్టిక్స్ మాత్రమే ఉన్నాయని.. అమర్చిన పేలుడు పదార్థాలు లేవని చెప్పారు. కారులో జిలెటిన్ స్టిక్స్ లభించిన అంశాన్ని మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ముఖ్ కూడా ధృవీకరించారు. ఘటనను ముంబై క్రైం బ్రాంచ్ విచారిస్తోందని తెలిపారు.
పేలుడు పదార్థాలు లభించిన తర్వాత కార్మికల్ రోడ్ వద్దకు భారీగా పోలీసులు తరలివచ్చారు. కమాండోలు, ఏటీఎస్ కూడా అక్కడికి చేరుకున్నారు. ఆ సమీప ప్రాంతంలో అనుమానాస్పద వాహనాలు సంచరించే అంశాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. పేలుడు పదార్థాల ఘటనలో ఉగ్రవాద కోణం ఉందా అనే అంశాన్ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.