చరిత్ర: సముద్ర గర్భంలో కలిసిపోయిన పోర్టు సిటీ.. శాస్త్రవేత్తలు ఏం చేస్తున్నారో తెలుసా..?
1000 ఏళ్ల క్రితం నాటి చోళ వంశీయులు తమిళనాడులో నిర్మించిన పోర్టు సిటీ కాలక్రమంలో మాయమైంది. ఇప్పుడు ఆ పోర్ట్ సిటీని డిజిటల్ పద్ధతిలో నిర్మించేందుకు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖతో పాటు ఇతర సంస్థలు సిద్ధమయ్యాయి. దక్షిణ తమిళనాడులోని పూమ్పహార్పట్టణంకు 30 కిలోమీటర్ల దూరంలో ఈ పోర్టు సిటీ అప్పట్లో ఉండేదని ఇదే విషయాన్ని సంగం తమిళ సాహిత్యంలోని సమగ్రకథనాలు కూడా పొందుపర్చారని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ చెబుతోంది. అయితే సముద్రం మట్టం పెరగడంతో ఈ నగరం తుడిచిపెట్టుకుపోయినట్లు ఆ కథనాల్లో రాశారని ప్రభుత్వం చెబుతోంది.
పూమ్పహార్ పట్టణానికి సమీపంలో పోర్టు సిటీ
పూమ్పహార్ పట్టణానికి సమీపంలో ఈ పోర్టు సిటీ ఉందని పలు తమిళ సాహిత్యంలో కథనాలు ఉన్నప్పటికీ... పురావస్తు శాఖ, చరిత్ర, సమద్ర గర్భ పరిశోధనలు, ఇతర శాస్త్రీయ పరిశోధనలు మాత్రం ఈ పోర్టు సిటీ కరెక్టుగా ఎక్కడ ఉందో మిస్టరీగా మారడంతో కచ్చితంగా చెప్పలేకున్నామని కేంద్రం చెబుతోంది. ప్రస్తుతం డిజిటల్ స్టడీ ఆధారంగా ఆ నగరాన్ని కనుగొనే ప్రయత్నం చేస్తున్నట్లు కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ చెబుతోంది. ఇందుకోసం సముద్రగర్భంలో సర్వేలు, ఫోటోగ్రఫీ,సీబెడ్ డ్రిల్లింగ్, జియోడైనమిక్స్ స్టడీస్ ద్వారా కనుగొనే ప్రయత్నం చేస్తున్నట్లు కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ తెలిపింది. ఆ నగరం ఎప్పుడు పుట్టిందో ఎప్పుడు మాయమైందో అనే విషయాలను ఈ స్టడీస్ ద్వారా తెలుసుకుంటామని చెప్పింది. ఇక 20వేల ఏళ్ల క్రితం సముద్ర మట్టంలో పెరుగుదల, వరదలు, సునామీ, తుఫాన్లను కూడా స్టడీ చేస్తామని అధికారులు చెప్పారు. వీటి నుంచి సేకరించే సమాచారంతో పూంపహార్ చరిత్రకు సంబంధించిన విషయాలు బయటపడుతున్నాయి.
గుజరాత్లో ద్వారకా నగరం
ఇలాంటి తరహాలోనే మరో ప్రాజెక్టు గుజరాత్లోని ద్వారాకా నగరంలో చేపడుతున్నట్లు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలో పనిచేసే ఉన్నతాధికారి డాక్టర్ కేఆర్ మురళీ మోహన్ చెప్పారు. ఇప్పటికే ద్వారాకా పరిశోధనల్లో పురోగతి సాధించామని చెప్పారు. అయితే పూమ్పహార్లో మాత్రం ఇంకా పరిశోధనలు చేస్తున్నామని వెల్లడించారు. భౌగోళికంగా రెండు విభిన్న ప్రాంతాలని చెప్పారు డాక్టర్ మురళీ మోహన్. పూమ్పహార్ పునర్నిర్మాణం కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ విభాగంలోని డిజిటల్ హెరిటేజ్ ప్రాజెక్టు కింద చేపడుతున్నట్లు అధికారులు చెప్పారు. ఇప్పటికే డిజిటల్ హంపీ ప్రాజెక్టును పూర్తి చేసి నేషనల్ మ్యూజియంలోని డిస్ప్లేలో ఉంచినట్లు ఆయన చెప్పారు.
నగరాల పుట్టుపూర్వోత్తరాలపై స్టడీ
ఇక ప్రాజెక్టు రెండో దశలో భాగంగా గుజరాత్, తమిళనాడులోని చారిత్రక నగరాలను వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు కేంద్రం చెబుతోంది. ఈ నగరాలు ఎలా నిర్మితమయ్యాయో, ఇవి సముద్రం గర్భంలో ఎలా కలిసిపోయాయో అనేదానిపై పరిశోధన చేసి వాస్తవాలను వెలికితీస్తామని కేంద్రప్రభుత్వం చెప్పింది. ఇక పూమ్పహార్ ప్రాజెక్టుకు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ 13 మంది నిపుణులను , పరిశోధనా కేంద్రాలను, సిద్ధం చేసినట్లు చెప్పారు. నగరాల చరిత్ర గురించి వీరు చెబుతారని వెల్లడించారు. స్కూల్ ఆఫ్ మెరైన్ సైన్సెస్, అలగప్ప యూనివర్శిటీ, అకాడెమీ ఆఫ్ మెరైన్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓసియన్ టెక్నాలజీలను ఎంపిక చేసినట్లు కేంద్రం చెప్పింది.
వాణిజ్యపరంగా విరాజిల్లిన నగరం
ఇదిలా ఉంటే పూమ్పహార్ పోర్టు సిటీ ఒకప్పుడు వాణిజ్యపరంగా విరాజిల్లిందని ఆ తర్వాత కాలక్రమంలో మాయమైందని అలగప్ప యూనివర్శిటీ ప్రొఫెసర్ ప్రాజెక్ట్ డిజిటల్ పూమ్పహార్ కోఆర్డినేటర్ రామస్వామి చెప్పారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ముందుగా పోర్టు సిటీ ఎక్కడ పుట్టింది.. అనంతరం ఎక్కడికి కదిలింది.. ప్రస్తుతం దాని పరిస్థితి ఏంటనే అంశాలను దశలవారీగా స్టడీ చేస్తామని చెప్పారు. పోర్ట్ సిటీ పై ప్రాథమికంగా జరిపిన పరిశోధనల్లో ఇండియన్ రిమోట్ సెన్సింగ్కు చెందిన శాటిలైట్ల ఇచ్చిన సమాచారం చూస్తే.... పోర్టు సిటీ 15000 ఏళ్ల క్రితం ముందుగా కావేరీ డెల్టా ప్రాంతంలో ఉండేదని ఇది పూమ్పహార్కు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లుగా తెలుస్తోందని ప్రొఫెసర్ రామసామీ చెప్పారు. ఆ తర్వాత పశ్చిమ దిశగా 10 కిలోమీటర్లు దూరంకు షిఫ్ట్ అయినట్లు తెలుస్తోంది. ఇక 3వేల ఏళ్ల క్రితం కావేరీ ముఖద్వారం వద్దకు చేరుకున్నట్లు తెలుస్తోంది.