రేప్ కేసు: లైంగిక పరీక్షకు ఆస్పత్రికి నిత్యానంద
బెంగళూర్: అత్యాచారంతో పాటు వివిధ క్రిమినల్ ఆరోపణలు ఎదుర్కుంటున్న స్వామి నిత్యానందను పోలీసులు సోమవారం ఉదయం బెంగళూర్లోని విక్టోరియా ఆస్పత్రికి తీసుకుని వచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు లైంగిక పటుత్వ పరీక్షలను నిర్వహించి ఆయన లైంగిక సామర్థ్యాన్ని బేరీజు వేయడానికి ఆయనను ఆస్పత్రికి తీసుకుని వచ్చారు.
నిత్యానంద అత్యాచారం, మోసం, అసహజమైన నేరాలు, నేరాలకు ప్రేరేపణ వంటి పలు ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. మాజీ భక్తుల ఫిర్యాదుతో ఆయనపై ఆ కేసులు నమోదయ్యాయి. నిత్యానందను పోలీసులు 2010లో హిమాచల్ ప్రదేశ్లో అరెస్టు చేశారు.
అయితే, అదే ఏడాది ఆయన బెయిల్పై విడుదలయ్యారు నిత్యానందంపై బెంగళూర్లో విచారణ జరిగింది. కర్ణాటక హైకోర్టులో ఇంతకు ముందు రిట్ పిటిషన్ దాఖలు కావడంతో ఆయనపై విచారణ సాగింది.
అత్యాచారాల కేసుల్లో నిందితులకు లైంగిక పటుత్వ పరీక్షలు నిర్వహించాల్సిందేనని, నిత్యానంద ఆ పరీక్షలు ఎదుర్కోక తప్పదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. నిత్యానందకు లైంగిక పటుత్వ పరీక్షల నిర్వహణలో జరిగిన జాప్యంపై ఒకానొక సందర్భంలో కోర్టు పోలీసులపై ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది.