ఆయనే నా హీరో, ఏం చెప్పిన నమ్మేస్తా: ఉమా భారతి
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి తన హీరో అని, అందుకే ఆయన ఏం చెబితే అది నేను నమ్ముతానని కేంద్రమంత్రి, బీజేపీ నేత ఉమా భారతి ఆదివారం నాడు వ్యాఖ్యానించారు.
అయోధ్యలో రామ మందిర నిర్మాణం అంశం చర్చల ద్వారా పరిష్కృతమయ్యేందుకు తీర్మానం అవసరమని ఉమా భారతి వ్యాఖ్యానించారు. ఈ ఏడాది చివరి కల్లా రామాలయం నిర్మాణపు పనులు ప్రారంభమవుతాయని బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి చేసిన వ్యాఖ్యలపై తనకు నమ్మకముందన్నారు.
తనకు పదిహేను, పదహారేళ్ల వయస్సు ఉన్నప్పుడు దేశంలో ఎమర్జెన్సీ విధించారని చెప్పారు. అప్పుడు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా సుబ్రహ్మణ్య స్వామి, జార్జి ఫెర్నాండేజ్ వంటి నాయకులు పోరాడారని చెప్పారు. అందుకే వారు తన హీరోలు అని చెప్పారు. అందుకే వారేం చెప్పిన విశ్వసిస్తానని చెప్పారు.
ఆయనే తన హీరో అని చెప్పారు. దశాబ్దాల నుంచి అపరిష్కృతంగా ఉన్న ఈ వివాదం చర్చల ద్వారా పరిష్కారమవుతుందన్నారు. ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండగా రామ మందిర నిర్మాణంపై ప్రశ్నలను బీజేపీ దాటవేస్తున్న నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకొన్నాయి.