47ఏళ్ల పోరాటంలో విజయం సాధించిన సుబ్రహ్మణ్య స్వామి..ఏంటా పోరాటం..?
ఢిల్లీ: ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యన్ స్వామికి ఈ సారి కోర్టులో భారీ ఊరట లభించింది. ఢిల్లీలోని స్థానిక కోర్టు స్వామికి రావాల్సిన జీతభత్యాలను చెల్లించాలంటూ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీకి ఆదేశాలు జారీ చేసింది. 1972 నుంచి 1991 వరకు ఆయన ఢిల్లీ ఐఐటీలో పనిచేశారు. ఏడాదికి 8శాతం వడ్డీ వేసి స్వామికి జీతభత్యాలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. దీంతో సుబ్రహ్మణ్యన్ స్వామికి రూ.40 నుంచి 45 లక్షలు వేతనం రూపంలో రానుంది.
కోర్టు ఆదేశాలపై ఐఐటీ ఢిల్లీ అధికారులు స్పందించారు. ఈ విషయాన్ని బోర్డు సభ్యుల దృష్టికి తీసుకెళుతామని చెప్పారు. బోర్డు సభ్యులు మాత్రమే నిర్ణయిస్తారని ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్ వి.రామగోపాల్ రావు తెలిపారు. రాజకీయాల్లోకి రాకముందు సుబ్రహ్మణ్య స్వామి ఆర్థికశాస్త్రం ఐఐటీలో మూడేళ్ల పాటు బోధన చేశారు. 1969 నుంచి 1972 వరకు ఆయన అధ్యాపకుడిగా పనిచేశారు. ఇక 1972లో పాలనాధికారులతో విబేధాలు రావడంతో ఆయనపై వేటు వేశారు. 1991లో తనను తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తనపై వేటు వేశారని చెప్పిన స్వామి.... ఇక అప్పటి నుంచి తనకు వేతనం చెల్లించాలంటూ కోర్టును ఆశ్రయించారు. దాదాపు 40 ఏళ్ల తర్వాత తన పోరాటానికి ఫలితం దక్కిందని స్వామి ట్వీట్ చేశారు.
After 47 years the IIT Delhi lost to me In The Saket Court and has to pay my back salary at annual 8% interest compounded. Earlier they had to restore me to my Professorship of Economics.which I resigned after a day. Let this be an example to all perverts in the academic world
— Subramanian Swamy (@Swamy39) April 8, 2019
ప్రపంచంలోని తప్పుడు ఆలోచనలతో ఉన్న విద్యావేత్తలకందరికి కోర్టు తీర్పు ఓ చెంపపెట్టులాంటిదని తన ట్వీట్లో పేర్కొన్నారు సుబ్రహ్మణియన్ స్వామి. 18శాతం వడ్డీతో తన జీతం చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును స్వామి అభ్యర్థించారు. అయితే స్వామి అభ్యర్థనను పక్కన బెట్టిన న్యాయస్థానం 8శాతం వడ్డీతో జీతభత్యాలను చెల్లించాలని ఆదేశించింది. ఇక తన చెల్లింపులకు సంబంధించి స్వామి ఎలాంటి సమాచారం పొందుపర్చనందున తన వేతనం చెల్లించలేదని ఐఐటీ ఢిల్లీ సమాధానంగా చెప్పింది. అంతేకాదు తనపై వేటు పడిన సమయంలో హార్వర్డ్ సమ్మర్ స్కూలులో ఆర్థికశాస్త్రం బోధించారని చెప్పుకొచ్చింది.