సాయిబాబా ముస్లిం, గొడ్డు మాంసం తినేవాడు: స్వరూపానంద వివాదాస్పద వ్యాఖ్యలు
వారణాసి: ద్వారకా పీఠాధిపతి శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతీ మరోసారి షిర్డీ సాయిబాబాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సాయిబాబా ఓ ముస్లిం అని, ఆయన గొడ్డు మాంసం తినేవాడని ఆరోపించారు. తన వద్దకు స్వస్థత కోసం వచ్చే బాధితుల కోసం సాయిబాబా ఫతీహా చదివేవారని తెలిపారు.
‘సబ్ కా మాలిక్ ఏక్' అన్న నినాదం గురునానక్ దని, సాయిబాబా చెప్పింది కాదని అన్నారు. హిందూ ఆలయాల్లో సాయి ప్రతిమలు పెట్డాన్ని ప్రభుత్వం వ్యతిరేకించాలని ద్వారకా పీఠాధిపతి కోరారు. ఆయన సాయి ట్రస్ట్ పైనా విమర్శలు గుప్పించారు. ట్రస్ట్ ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు. ప్రజల నుంచి వసూలైన వందల కోట్ల సొమ్మును వివిధ బ్యాంకుల్లో దాచారని ఆరోపించారు.
ట్రస్ట్ పేరుతో వివిధ బ్యాంకుల్లో మూలుగుతున్న కోట్లాది రూపాయలను స్వాధీనం చేసుకోవాలని స్వరూపానంద డిమాండ్ చేశారు. ఆగ్రాలోని తాజ్ మహల్, అజ్మీర్ దర్గాల్లోని శివలింగాన్ని ధ్వంసం చేసి ముస్లిం పాలకుల సమాధులు కట్టారని ఆయన ఆరోపించారు.
గతంలోనూ స్వామి స్వరూపానంద సరస్వతి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సాయిబాబా దేవుడు కాదని, ఆయనను పూజించరాదని వ్యాఖ్యానించారు.