టెక్కీ స్వాతి హత్యపై సినిమా: సంచలనమైన ట్రైలర్(వీడియో)
చెన్నై: నుంగంబాక్కం రైల్వేస్టేషన్లో పట్టపగలు జరిగిన టెక్కీ స్వాతి హత్య ఘటన తమిళనాడుతోపాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కాగా, ప్రస్తుతం ఈ ఘటనపై ఓ చిత్రం రూపొందింది. దీనికి సంబంధించిన ట్రైలర్ను కూడా ఇటీవలే విడుదల చేశారు.
స్వాతి కొలై పళక్కు
స్వాతి హత్య ఘటనను ‘స్వాతి కొలై వళక్కు' (స్వాతి హత్య కేసు) పేరుతో ఈ చిత్రాన్ని జయశ్రీ ప్రొడక్షన్స్ పతాకంపై ఎస్ కె.సుబ్బయ్య నిర్మించగా రమేష్ సెల్వన్ దర్శకత్వం వహించారు. ‘స్వాతి కొలై వళక్కు' చిత్రంలో టెకీ స్వాతి పాత్రలో ఆయిరా నటించారు.
రామ్ కుమార్గా మనో
స్వాతి హత్యకేసు నిందితుడు రామ్కుమార్ పాత్రలో మనో అనే కొత్త నటుడు, న్యాయవాది రాంరాజ్ పాత్రలో వెంకటేష్, స్వాతి హత్యకేసు విచారించిన నుంగంబాక్కం పోలీస్ ఇన్స్పెక్టరు పాత్రలో అజ్మల్ అమీర్లు నటించారు.
కల్పిత ఘటనల తక్కువే..
యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించే చిత్రాల్లో ప్రేక్షకులను ఆకట్టుకునేలా కొన్ని కల్పిత ఘటనలు అదనంగా చేర్చడం సాధారణమే. కానీ, ‘స్వాతి కొలై వళక్కు'లో అలాంటి సన్నివేశాల్ని చేర్చలేదని, జరిగిన సంఘటలను యథాతథంగా పునర్నిర్మించామని, ఈ హత్యకేసులో ప్రజలకు తెలియని పలు విషయాలు ఈ చిత్రంలో ఉన్నాయని దర్శకుడు రమేష్ తెలిపారు.
పోలీసులే రాంకుమార్ గొంతుకోశారు?
ఈ చిత్రం ట్రైలర్ను సోమవారం చెన్నై వడపళనిలోని ప్రసాద్ ల్యాబ్లో విడుదల చేశారు. నిందితుడు రామ్కుమార్ను పట్టుకునే సమయంలో అతడు గొంతు కోసుకున్నట్లు పోలీసులు చెబుతుండగా పోలీసులే అతని గొంతు కోసినట్లు అప్పట్లో ప్రచారం కూడా జరిగింది. కాగా, ఈ చిత్రం ట్రైలర్లో రామ్కుమార్ గొంతును పోలీసులు కోసినట్లుగా చూపడం గమనార్హం.
వారి పేర్లనే ఉపయోగించాం
ఈ చిత్రం ద్వారా ప్రజలకు మంచి సందేశం ఇవ్వాలనే ప్రయత్నించినట్లు దర్శకుడు రమేష్ తెలిపారు. అంతేగాక, సినిమాలో ఘటనకు సంబంధించిన పాత్రల అసలు పేర్లనే ఉపయోగించినట్లు తెలిపారు. ఇలాంటి అవాంఛిత ఘటనలు జరిగిన సమయంలో ప్రజలు స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. తన సినిమాలే ఇదే చూపించినట్లు చెప్పారు.