రామ్ కుమార్ మృతి, ఎన్నో అనుమానాలు: లాయర్ కంటతడి
చెన్నై: ఇన్ఫోసిస్ టెక్కీ స్వాతి హత్య కేసు నిందితుడు రామ్ కుమార్ ఆదివారం సాయంత్రం జైలు లోపలి విద్యుత్ తీగలను పట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెప్పారు. అయితే, తన కొడుకు ఆత్మహత్య చేసుకోలేదని, ఎవరో చంపేశారని అతని తండ్రి ఆరోపిస్తున్నారు. రామ్ కుమార్ తరఫున వాదిస్తున్న లాయర్ కంటతడి పెట్టుకున్నారు.
సోమవారం విచారణకు బెయిల్ పిటిషన్ వచ్చే ముందే..
ఇన్ఫోసిస్ టెక్కీ స్వాతి హత్య కేసు నిందితుడు రామ్ కుమార్ బెయిల్ పిటిషన్ ఈ రోజు (సోమవారం) నాడు విచారణకు రావాల్సి ఉంది. ఇలాంటి సమయంలో రామ్ కుమార్ జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో రామ్ కుమార్ తరఫు వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
కంటతడి పెట్టిన న్యాయవాది
ఇన్ఫోసిస్ టెక్కీ స్వాతి హత్య కేసు నిందితుడు రామ్ కుమార్ తరఫున రామరాజ్ అనే న్యాయవాది వాదిస్తున్నారు. రామ్ కుమార్ మృతి పైన ఆయన అనుమానాలు వ్యక్తం చేసారు. అతను మీడియాతో మాట్లాడుతూ.. కంటతడి పెట్టారు. ఆదివారం సాయంత్రం రామ్ కుమార్ మృతి చెందిన విషయం తెలియగానే లాయర్ రామరాజ్, రామ్ కుమార్ కుటుంబ సభ్యులు, టిపిడికే కేడర్.. రాయపేఠ ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు.
పోలీసులే చంపారన్న తండ్రి
తన కొడుకు రామ్ కుమార్ను పోలీసులే చంపేశారని తండ్రి పరమేశ్వరన్ ఆరోపిస్తున్నారు. తన కొడుకు మృతి పైన తనకు అనుమానాలు ఉన్నాయన్నారు. దీని పైన సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. లేదంటే తాము తమ కొడుకు మృతదేహాన్ని తీసుకోమని చెప్పారు.
అనుమానం వ్యక్తం చేస్తున్న రామ్ కుమార్ బంధువులు
రామ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడన్న పోలీసుల ప్రకటన పై అతని కుటుంబ సభ్యులు, బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తన కొడుకు పిరికివాడుకాదని తండ్రి చెప్పారు. అలాగే, లాయర్ మాట్లాడుతూ.. తాను అతనిని ముందు రోజే కలిశానని, అతనిని చూస్తే ఆత్మహత్య చేసుకునేలా కనిపించలేదన్నారు. రామ్ కుమార్ హఠాత్తుగా ఆత్మహత్య చేసుకోవడం ఎన్నో అనుమానాలకు తావిస్తోందని చాలామంది భావిస్తున్నారు.