టెక్కీ స్వాతి మర్డర్ కేసు: నేడు రామ్కుమార్ మృతదేహానికి పోస్టుమార్టం
చెన్నై: సాప్ట్వేర్ ఉద్యోగిని స్వాతి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రామ్ కుమార్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహణపై సందిగ్ధత వీడింది. ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యనిపుణుడు డాక్టర్ సుధీర్ కె.గుప్తా సమక్షంలో శనివారం రామ్ కుమార్ మృతదేహానికి పోస్టుమార్టం జరగనుంది.
ఈ కేసులో నిందితుడిగా ఉన్న రామ్ కుమార్ సెప్టెంబర్ 18 (ఆదివారం) చెన్నైలోని పుళల్ సెంట్రల్ జైళ్లో అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. దీంతో రామ్ కుమార్ మృతదేహానికి ఇంకా పోస్టు మార్టం నిర్వహించలేదు. రామ్ కుమార్ జైలులో తనకు కేటాయించిన ప్రత్యేక బరాక్లో కరెంట్ వైర్ను కొరికి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
దీనిపై స్పందించిన జైలు అధికారులు వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. 19వ తేదీ నుంచి రాయపేట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరచిన రామ్కుమార్ మృతదేహానికి పోస్టుమార్టం జరిపేందుకు ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి.
ఈనెల 20వ తేదీన రామ్ కుమార్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేలా ఏర్పాట్లు సిద్ధం చేసినా, రామ్ కుమార్ తండ్రి పరమశివన్ తమ తరఫున ప్రైవేటు వైద్యుడిని అనుమతించాలంటూ మద్రాసు హైకోర్టు, సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాయి.
ఈ నేపథ్యంలో మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి కృపాకరన్ ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రి వైద్యుడి సమక్షంలో నేడు రామ్కుమార్ మృతదేహానికి పోస్టుమార్టం జరగనుంది. డాక్టర్ సుధీర్కె గుప్తా ఢిల్లీ నుంచి బయల్దేరి ఇప్పటికే చెన్నై చేరుకున్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
ఆయన సమక్షంలోనే రాయపేట ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం ఉదయం కీల్పాక్ ఫోరెన్సిక్ విభాగం అధ్యక్షుడు చెల్లకుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ మనికంఠ రాజు, రాయపేట ప్రభుత్వ ఆసుపత్రి అసిస్టెంట్ ప్రొఫెసర్ వినోద్, స్టాన్లీ ఆసుపత్రి అసిస్టెంట్ ప్రొఫెసర్ బాలసుబ్రమణితో కూడిన వైద్యబృందం రామ్కుమార్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు.
రామ్ కుమార్ మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహిస్తున్న సందర్భంగా రాయపేట ప్రభుత్వ ఆసుపత్రి చుట్టూ శుక్రవారం నుంచి భారీగా పోలీసు బందోబస్తుని ఏర్పాటు చేశారు.