దేశం పరువు తీసిన యూపీ యువకులు: స్విస్ జంటకు వేధింపులు, దాడి, తీవ్రగాయాలు
Recommended Video
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కొందరు యువకులు దేశం పరువు తీసేలా వ్యవహరించారు. భారత పర్యటనకు వచ్చిన స్విస్ జంటపై నలుగురు యువకులు వేధింపులకు పాల్పడ్డారు. అంతేగాక, వారిపై దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. గత ఆదివారం యూపీలోని ఫతేపూర్ సిక్రీలో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వెంబడిస్తూ వేధింపులు..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... స్విట్జర్లాండ్లోని లాసానె నగరానికి చెందిన క్వెంటిన్ జెరెమీ క్లెరిక్ (24), అతని ప్రియురాలు మారీ డ్రోక్జ్ (24)లు కలిసి తమ పర్యటనలో భాగంగా ఫతేపూర్ సిక్రీ చేరుకున్నారు. రైల్వే స్టేషన్లో వారిని చూసిన నలుగురు యువకులు వారిని అనుసరించడం మొదలుపెట్టారు. వారిని కామెంట్లు చేస్తూ వేధించడమేగాక, వారిని ఆపి యువతితో బలవంతంగా ఫొటోలు తీసుకున్నారు. ఆ తర్వాత వారిపై దాడికి పాల్పడ్డారు.
అసభ్యంగా ప్రవర్తించారు..
తాము సెప్టెంబరు 30న ఇండియా వచ్చామని, శనివారం ఆగ్రా చేరుకున్నట్టు క్వెంటిన్ చెప్పారు. అక్కడ రెండురోజుల ఉన్న తర్వాత ఆదివారం ఫతేపూర్ సిక్రీ వచ్చినట్టు క్వెంటిన్ తెలిపాడు. రైల్వే స్టేషన్లో నిలబడి ఉండగా యువకులు తమతో అసభ్యంగా ప్రవర్తించారని, బలవంతంగా సెల్పీలు తీసుకున్నారని చెప్పాడు. వాళ్లేవో కామెంట్లు చేశారని, అయితే అవి తమకు అర్థం కాలేదన్నాడు. తమ అభ్యంతరాలను పట్టించుకోకుండా ఫొటోలు తీస్తూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.
కర్రలతో దాడి...
ఆ తర్వాత ఆ యువకులు తన తలపై కర్రతో దాడి చేశారని, తాను కిందపడిపోయినా కొడుతూనే ఉన్నారని క్వెంటిన్ తెలిపాడు. దీంతో తన ప్రియురాలు సాయం కోసం కేకలు వేసిందని పేర్కొన్నాడు. ఆమెపైనా వారు దాడి చేశారన్నాడు. తమకు సాయం కోసం వచ్చిన వారిని చూసి యువకులు పారిపోయారని తెలిపాడు. గాయాలపాలైన జంటను పోలీసులు తొలుత స్థానిక ఆసుపత్రికి ఆ తర్వాత ఆగ్రాకు తరలించారు. పరిస్థితి మరింతగా విషమించడంతో వారిని అక్కడి నుంచి ఢిల్లీలోని అపోలో ఆసుపత్రికి తరలించారు.
తీవ్ర గాయాలు.. ఢిల్లీకి తరలింపు..
క్వెంటిన్కు తలకు ఫ్రాక్చర్ అయిందని, మెదడులో కొంత రక్తం గడ్డకట్టుకుపోయిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అతడిని ఐసీయూలో ఉంచి వైద్యం అందిస్తున్నట్టు తెలిపారు. యువతి ఎడమ చేయికి గాయమైనట్టు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్థానికుల సాయంతో నిందితుల కోసం గాలింపు చేపట్టారు. నిందితుల్లో ఇద్దరిని గుర్తించారు. అయితే, ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదు.
కాగా, ఈ ఘటనపై విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఘటనకు సంబంధించిన పూర్తి నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశించారు.