స్విస్ జంటపై దాడి: ఐదుగురు మైనర్ల అరెస్ట్, పరారీలోనే మరో నిందితుడు
లక్నో: స్విట్జర్లాండ్ జంటపై దాడి కేసులో ఉత్తరప్రదేశ్ పోలీసులు ఇప్పటి వరకు ఐదుగురు మైనర్లను అరెస్ట్ చేశారు. భారత పర్యటనకు వచ్చిన క్వెంటిన్ జెరెమీ క్లెర్క్, మారీ డ్రోక్జ్లపై గత ఆదివారం ఉత్తరప్రదేశ్లోని ఫతేపూర్సిక్రీలో దాడి జరిగిన విషయం తెలిసిందే. కొందరు వ్యక్తులు వారిని అనుసరించి బలవంతంగా వారితో సెల్ఫీలు తీసుకున్నారు.
అంతేగాక, ప్రశ్నించిన వారిపై కర్రతో దాడి చేశారు. వారి దాడిలో క్వెంటిన్ తలకు తీవ్ర గాయమైంది. డ్రోక్జ్ ఎడమచేయి విరిగింది. ప్రస్తుతం వీరు ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే ఈ ఘటనపై విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ స్పందించారు. ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె.. వెంటనే నివేదిక అందించాలని ఆదేశించారు.
దేశం పరువు తీసిన యూపీ యువకులు: స్విస్ జంటకు వేధింపులు, దాడి, తీవ్రగాయాలు
పర్యాటకులను భయభ్రాంతులకు గురిచేసేలా జరిగిన ఈ ఘటనపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్విస్ జంటపై దాడి చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
కాగా, గురువారం పోలీసులు అరెస్ట్ చేసిన ఐదుగురూ మైనర్లే కావడం గమనార్హం. పరారీలో ఉన్న ఆరో నేరగాడూ కూడా మైనరే అయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అతడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. కాగా, స్విస్ జంట పొదల మాటున ఏకాంతంగా ఉండటాన్ని చూసిన నిందితులు వారిపై దాడి చేశారని డీఎస్పీ అఖిలేష్ నారాయణ్ సింగ్ చెప్పారు.