ఇక స్విస్ ఖాతాల గుట్టు రట్టు: 2018 నుంచి ఆటోమేటిక్గా స్విట్జర్లాండ్ సమాచారం
స్విస్ బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్న భారతీయులకు సంబందించిన ఆర్థిక సమాచారం ఆటోమేటిక్గా 2019 సెప్టెంబర్ నుంచి భారత ప్రభుత్వానికి అందనుంది.
న్యూఢిల్లీ: నల్లధనంపై కేంద్రం పోరాటంలో మరో పెద్ద ముందడుగు పడింది. స్విట్జర్లాండ్తో సమాచార మార్పిడికి ఒప్పందం కుదిరింది. స్విస్ బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్న భారతీయులకు సంబందించిన ఆర్థిక సమాచారం ఆటోమేటిక్గా 2019 సెప్టెంబర్ నుంచి భారత ప్రభుత్వానికి అందనుంది.
విదేశాల్లో పోగుపడుతున్న నల్లధనంపై పోరాడేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుంది. ఇరు దేశాల మధ్య ఆటోమేటిక్ సమాచార మార్పిడి అమలు కోసం ఉద్దేశించిన ఉమ్మడి ప్రకటనపై సీబీడీటీ చైర్మన్ సుశీల్ చంద్ర, భారతదేశంలో స్విస్ రాయబార కార్యాలయ డిప్యూటీ చీఫ్ గిల్లీస్ రోడ్యుట్ మంగళవారం సంతకాలు చేశారు.
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో ఈ వివరాలు వెల్లడించింది. భారతదేశ పౌరులు 2018 నుంచి స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో నిర్వహించే అకౌంట్లకు సంబంధించిన సమాచారం ఆటోమేటిక్గా భారత ప్రభుత్వానికి అందుతాయని పేర్కొంది. ఆఫ్షోర్ అకౌంట్లలో పోగుపడిన నల్లధనంతో పోరాడటానికి ప్రస్తుత ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని తెలిపింది.
సమాచార గోప్యతకు భంగం కలగనీయమని స్విస్కు భారత్ హామీ ఇచ్చింది. ఆటోమేటిక్ ఎక్సేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఒప్పందం వల్ల 2019 సెప్టెంబర్ నుంచి స్విస్ బ్యాంకులలో భారతీయుల ఖాతాల సమాచారాన్ని పొందవచ్చునని ఆర్థిక శాఖ పేర్కొంది.
బహుపాక్షిక సమర్థ సంస్థ ఒప్పందం (ఎంసీఏఏ: మల్టీలేటరల్ కంపీటెంట్ అథారిటీ అగ్రిమెంట్) కింద భారత దేశంతో ఏఈఓఐ కుదుర్చుకున్నామని స్విస్ ఆర్థిక శాఖ తెలిపింది.
అయితే ఖాతాల సమాచారం ఇవ్వాలంటూ భారత్ నుంచి పెండింగులో ఉన్న అభ్యర్థనల పైన ఒప్పందం సందర్భంగా చర్చకు రాలేదు. గత జూన్ నెలలో సవిస్ అధ్యక్షులు జోహాన్ ష్నెడర్ అమ్మన్తో జెనీవాలో భేటీ సందర్భంగా ప్రధాని మోడీ స్విస్ ఖాతాల సమాచారం ఇచ్చిపుచ్చుకోవడంపై చర్చించారు.