రికార్డులు కాదు..రూల్స్ బ్రేక్ చేసిన సైరా: మండి పడుతున్న కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్
బెంగళూరు: మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా మూవీ బుధవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. కర్నూలు జిల్లా ఉయ్యాలవాడకు చెందిన స్వాతంత్య్ర సమర యోధుడు నరసింహా రెడ్డి బయోపిక్ గా చిత్రీకరించిన ఈ సినిమా విడుదల వ్యవహారం కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ లో కాక పుట్టించింది. చట్టానికి విరుద్ధంగా, నిబంధనలకు వ్యతిరేకంగా ఈ సినిమాను ప్రదర్శిస్తున్నారంటూ ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. కర్ణాటక సినిమాల క్రమబద్దీకరణ చట్టం-2014కు విరుద్ధంగా సినిమాను థియేటర్లలో ప్రదర్శిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఈ విషయాన్ని తాము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు, ప్రముఖ ఎగ్జిబిటర్ కేవీ చంద్రశేఖర్ వెల్లడించారు.
'సైరా’ అపశృతి: బ్యానర్ కడుతున్న ఫ్యాన్స్కి విద్యుత్ షాక్
ఏంటీ వివాదం?
పరభాషా సినిమాలు ఏవైనా సరే.. బెంగళూరు సహా ప్రముఖ నగరాల్లో తెల్లవారు జామున థియేటర్లలో ప్రదర్శించకూడదు. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వం ఓ చట్టాన్నే తీసుకొచ్చింది. దీనిపై 2014లో కర్ణాటక సినిమాల క్రమబద్దీకరణ చట్టాన్ని రూపొందించింది. జాతీయ , అంతర్జాతీయ స్థాయి సాంకేతిక ప్రమాణాలతో రూపొందే సినిమాలు శాండల్ వుడ్ చాలా తక్కువ. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్.. ఇలా ఆయా ప్రాంతీయ భాషల్లో రూపొందే సినిమాలతో పోల్చుకుంటే శాండల్ వుడ్ లో తయారయ్యే సినిమాల సాంకేతిక స్థాయి సగటు ప్రేక్షకుడి అంచనాలకు అందదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని కన్నడ చిత్ర పరిశ్రమను బతికించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ చట్టాన్ని రూపొందించింది. పర భాషా సినిమాలు కూడా కన్నడ భాషలో డబ్బింగ్ కు నోచుకోకపోవడానికీ ఇదే ప్రధాణ కారణం.
8 గంటల తరువాతే..
బెంగళూరులో పరభాషా సినిమాలు విడుదల కావడం కొత్తేమీ కాదు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ సినిమాలు ప్రతి ఒక్కటీ ఈ ఉద్యాన నగరిలో ప్రదర్శితమౌతుంటాయి. మిగిలిన రాష్ట్రాల సంగతి పక్కన పెడితే.. బెంగళూరు సహా కర్ణాటకలోని కొన్ని ప్రధాన నగరాల్లో పరభాషా సినిమాలను తెల్లవారు జామున థియేటర్లో ప్రదర్శించడంపై నిషేధం ఉంది. ఉదయం 8 గంటల తరువాతే ఆయా సినిమాలను ప్రదర్శించాల్సి ఉంటుంది. ఈ మేరకు కర్ణాటక సినిమాల క్రమబద్దీకరణ చట్టంలోని సెక్షన్ 41లో ఓ క్లాజును కూడా పొందుపరిచారు.
చట్టాన్ని ఉల్లంఘించిన సైరా
ఈ చట్టాన్ని సైరా ఎగ్జిబిటర్లు ఉల్లంఘించారనేది కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు చేస్తోన్న ఆరోపణ. చట్టానికి విరుద్ధంగా తెల్లవారు జామున థియేటర్లలో సైరాను ప్రదర్శించారని వారు చెబుతున్నారు. బెంగళూరులో సైరా తొలి షో.. బుధవారం తెల్లవారు జామున 3:30కు ప్రదర్శితమైంది. చట్ట ప్రకారం.. ఉదయం 8 గంటలకు తొలి షో పడాల్సి ఉండగా.. దీనికి విరుద్ధంగా ఒక్క బెంగళూరు నగరంలోనే పలు మల్టీ ప్లెక్సులు మొదలుకుని సాధారణ థియేటర్ వరకు 12 కాదు.. 20 కాదు.. ఏకంగా 42 షోలను ప్రదర్శించారు థియేటర్ల యజమానులు. బెంగళూరు లాల్ బాగ్ సమీపంలోని ఊర్వశి ప్రధాన థియేటర్ గా సైరా విడుదల కాగా.. ఆ బాక్సులను పొందిన దాదాపు అన్ని చోట్ల కూడా తెల్లవారు జామునే సైరా షోను వేశారని ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ విషయాన్ని తాము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కేవీ చంద్రశేఖర్ వెల్లడించారు.
టాలీవుడ్ కు అతి పెద్ద మార్కెట్..బెంగళూరు
టాలీవుడ్ కు అతి పెద్ద మార్కెట్ బెంగళూరు. ఓ చిన్న స్థాయి ప్రాంతం నుంచి లభించే వసూళ్ల కంటే అత్యధిక కలెక్షన్లు ఒక్క బెంగళూరు నుంచే సమకూరుతాయి. బెంగళూరులో తెలుగు వారే కాదు.. తెలుగు తెలిసిన, మాట్లాడ గలిగిన కన్నడిగులు లక్షల్లో ఉన్నారు. విద్య, ఉపాధి కోసం బెంగళూరులో స్థిరపడిన తెలుగు కుటుంబాలు వందల్లో ఉన్నాయి. కృష్ణరాజ పురం, యలహంక, మార్థహళ్లి, యశ్వంత్ పురా, బాగలూరు వంటి అనేక ప్రాంతాల్లో తెలుగు కుటుంబాలు నివసిస్తున్నాయి. బెంగళూరు మొత్తం జనాభా కోటి 20 లక్షలు కాగా.. అందులో 17 శాతం మంది తెలుగు వాళ్లున్నారు. దీనితో బెంగళూరు టాలీవుడ్ కు ఓ వరంలా మారింది. అందుకే- బెంగళూరు మార్కెట్ మీద ఫోకస్ అధికం. దీనికి తగ్గట్టుగానే కలెక్షన్లు సైతం ఉంటాయి.