సినిమా ఫక్కిలో తప్పించుకున్న ఉగ్రవాది
ఇటార్పీ: పోలీసుల అదుపులో ఉన్న అనుమానిత ఉగ్రవాది సినిమా ఫక్కిలో రైలులో నుంచి కిందకు దూకి తప్పించుకున్న సంఘటన మధ్యప్రదేశ్ లోని ఇటార్ఫీ సమీపంలో జరిగింది. కోర్టు విచారణకు పీటీ వారెంట్ పై తీసుకు వెళుతున్న సమయంలో ఉగ్రవాది పోలీసులకు సినిమా చూపించాడు.
తమిళనాడులోని వేలూరు జైలులో ఉంటున్న సయ్యద్ అహమ్మద్ ఆలీ (37) అనే నిందితుడు తప్పించుకున్నాడని శుక్రవారం పోలీసులు అన్నారు. బాంబు బెదిరింపు ఫోన్లు చేస్తున్నాడని 2015 ఆక్టోబర్ నెలలో వేలూరు పోలీసులు సయ్యద్ మహమ్మద్ ఆలీని అరెస్టు చేశారు.
కోర్టు విచారణ కోసం ఇతనిని పీటీ వారెంట్ మీద వేలూరు నుంచి లక్కోకు తీసుకు వెళుతున్నారు. రఫ్తీ సాగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలులో వీరు బయలుదేరారు. రైలు మధ్యప్రదేశ్ లోని ఇటార్ఫీ రైల్వే స్టేషన్ చేరుకుంటున్న సమయంలో సయ్యద్ రైలులో నుంచి కిందకు దూకి పరారైనాడు.
సయ్యద్ మహమ్మద్ ఆలీ చేతులకు బేడీలు వేసినా అతను తప్పించుకున్నాడని పోలీసు అధికారులు చెప్పారు. వెంటనే పోలీసులు రైల్వే పోలీసులకు, ఏటీఎస్ అధికారులకు, ఉగ్రవాద నిరోధక దళం అధికారులకు సమాచారం ఇచ్చారు.
సయ్యద్ ను పట్టుకోవడానికి ముమ్మరంగా గాలిస్తున్నారు. గతంలో సయ్యద్ తాజ్ మహల్, అజ్మీర్ దర్గాలో బాంబులు పెట్టారని బెదిరించాడని కేసులు నమోదు అయ్యాయి. ఇతను త్రిపురకు చెందిన వాడని సర్టిఫికెట్లు ఉన్నాయి.
అయితే సయ్యద్ మహమ్మద్ ఆలీ బంగ్లాదేశ్ కు చెందిన వాడని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని అరెస్టు చెయ్యడానికి రైల్వే, ఉగ్రవాద నిరోధక దళం, ఏటీఎస్ అధికారులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.