ఎస్వైఎల్ రగడ: ఢిల్లీలో ఐఎన్ఎల్డి ఆందోళన రక్తసిక్తం
న్యూఢిల్లీ: సుదీర్ఘ కాలంగా పంటల సాగుకు అవసరమైన నీటి సరఫరా కోసం హర్యానా ప్రజలు ఎదురుచూస్తున్నారు. తమ పొరుగు రాష్ట్రం పంజాబ్ మీదుగా సాగే సట్లెజ్ - యమునా లింక్ కెనాల్ నిర్మాణాన్ని పూర్తి చేసి తమను ఆదుకోవాలని అందుకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరుతూ ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్డీ) సారథ్యంలో జరిగిన నిరసన ప్రదర్శన రక్తసిక్తమైంది. ఢిల్లీలోని జంతర్మంతర్ నుంచి పార్లమెంట్ స్ట్రీట్ వైపు దూసుకొస్తున్నఆందోళనకారులపై పోలీసులు లాఠీలు ఝుళిపించారు. శాంతిని భంగం కలిగిస్తున్నారని పేర్కొంటూ చితకబాదారు. వెంటబడి తరిమారు.
పోలీసులు జరిపిన లాఠీచార్జిలో పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఈ రెండు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర వివాదంగా ఉన్న సట్లెజ్ - యమునా లింక్ (ఎస్వైఎల్) పూర్తి చేయడానికి.. అసలు నిర్మాణానికి పంజాబ్ అంగీకరించడం లేదు. పంజాబ్ లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇది కూడా ఒక ప్రచారాస్త్రంగా మారింది.
గురువారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కెప్టెన్ అమరీందర్ సింగ్.. ఈ అంశంపై సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ అమ్రుత్సర్ లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తాజాగా కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పరిస్థితి విషమంగా మారింది.
సుప్రీం తీర్పు వచ్చాక
ఇతర రాష్ట్రాలతో నదీ జలాల పంపిణీ ఒప్పందాలను రద్దుచేస్తూ పంజాబ్ ప్రభుత్వం ఆమోదించిన చట్టం రాజ్యాంగ విరుద్ధమని ఇటీవలే చివర్లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దీని ఆధారంగానే ఐఎన్ఎల్డీ రాష్ట్ర స్థాయిలోనూ, జాతీయ స్థాయిలోనూ ఆందోళనకు శ్రీకారం చుట్టింది
ఆయన మొహంలో చిరునవ్వులు
ఎస్వైఎల్ వివాదంపై తమకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు రావడంతో హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ముఖం చిరు నవ్వులు చిందించింది.
తీర్పుపై పంజాబ్ అసంతృప్తి
కానీ సుప్రీంకోర్టు తీర్పు వచ్చినప్పుడు అధికారంలో ఉన్న గత శిరోమణి అకాలీదళ్ - బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం అసంత్రుప్తి వ్యక్తం చేసింది.
వివాద పరిష్కారంపై అభయ్ చౌతాలా ఇలా
ఎస్వైఎల్ కెనాల్ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని ఐఎన్ఎల్డి నేత అభయ్ చౌతాలా కోరుతున్నారు. 6800కి పైగా గ్రామ పంచాయతీల నుంచి ఎస్వైఎల్ కెనాల్ నిర్మాణం చేపట్టాలని ఐఎన్ఎల్డి నాయకుడు అభయ్ చౌతాలాను కోరుతూ మెమోరాండం సమర్పించాయి.
మోదీ జోక్యం చేసుకోవాలి
ఎస్వైఎల్ కెనాల్ నిర్మాణం పూర్తి చేసేందుకు ప్రధాని నరేంద్రమోదీ జోక్యం చేసుకోవాలని ఐఎన్ఎల్డి నేత అభయ్ చౌతాలా కోరారు. ‘6800కి పైగా గ్రామ పంచాయతీలు సమర్పించిన వినతిపత్రాలు ప్రధాని మోదీకి సమర్పిస్తాం. తక్షణం కెనాల్ నిర్మాణానికి చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఎస్వైఎల్ కెనాల్ నిర్మాణం పూర్తి చేసుకుని నీరు పొందడం హర్యానా హక్కు. ఇంతకు మించి మరేం అక్కర్లేదు' అభయ్ చౌతాలా చెప్పారు.
సిర్సా సహా నాలుగు జిల్లాల నుంచి..
ఈ ఆందోళనకు సిర్సా, ఫతేహాబాద్, హిసార్, జింద్ జిల్లాల నుంచి ప్రజలు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చారని ఐఎన్ఎల్డి నేత అభయ్ చౌతాలా అన్నారు.
ఎస్ఎడి - బీజేపీ సర్కార్ చేసింది ఏమీ లేదు...
ఈ సమస్య పరిష్కరించడానికి శిరోమణి అకాలీదళ్ (ఎస్ఎడి) - బిజెపి సంకీర్ణ ప్రభుత్వాం చేసిందేమీ లేదని ఐఎన్ఎల్డి నేత అభయ్ చౌతాలా ఆరోపించారు.
కాంగ్రెస్కు పట్టం గట్టిన పంజాబీలు
ఇటీవల జరిగిన ఎన్నికల్లో పంజాబ్ ప్రజలు శిరోమణి అకాలీదళ్ - బిజెపి కూటమి సర్కార్ను సాగనంపారు. కెప్టెన్ అమరిందర్ సింగ్ సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీని గెలిపించారు.
ఉద్యమం వస్తుందని హెచ్చరిస్తున్న కెప్టెన్
ఒకవేళ వివాదాస్పద ఎస్వైఎల్ కెనాల్ నిర్మాణాన్ని హర్యానా ప్రభుత్వం చేపడితే పంజాబ్ రాష్ట్రంలో ఖలిస్థాన్ ఉద్యమం తలెత్తుతుందని పంజాబ్ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీపీసీసీ) అధ్యక్షుడు కెప్టెన్ అమరీందర్ సింగ్ ఆరోపించారు.
ఐఎన్ఎల్డి, అకాలీదళ్ బంధానికి బీటలు
ఒకప్పుడు ఇండియన్ నేషనల్ లోక్దళ్ (ఐఎన్ఎల్డి), శిరోమణి అకాలీదళ్ (ఎస్ఎడి) మొన్న మొన్నటి వరకు సన్నిహితమైన పార్టీలు. ఎస్వైఎల్ వివాదంపైనే ఇరు పార్టీల మధ్య సంబంధాలు బెడిసికొట్టాయి.