అందుకే కేబినెట్లో చేరలేదు.. అయినా మోడీ వెంటే ఉంటామన్న నితీశ్..
ఢిల్లీ : నరేంద్ర మోడీ 2.0 కేబినెట్లో చేరకపోవడంపై బీహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ మరోసారి స్పందించారు. నామమాత్రపు ప్రాతినిధ్యం ఇష్టం లేకనే మోడీ మంత్రివర్గంలో చేరలేదని చెప్పారు. కేబినెట్లో చేరకపోయినా మోడీ ప్రభుత్వానికి తమ మద్దతు కొనసాగుతుందని నితీశ్ స్పష్టం చేశారు.
సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు కనీవినీ ఎరగని విజయం కట్టబెట్టడంతో బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటుచేసేంత మెజార్టీ సాధించింది. ప్రభుత్వ ఏర్పాటుకు మిత్రపక్షాల అవసరం లేనందున వారికి నామమాత్రపు ప్రాతినిధ్యం కల్పించాలని భావించింది. అలాంటి ప్రాతినిధ్యం ఇష్టంలేకనే తాము కేబినెట్లో భాగస్వాములం కాలేదని నితీశ్ ప్రకటించారు. కేబినెట్లో ఒకట్రెండు మంత్రి పదవులు ఇవ్వడం, ఇవ్వకపోవడం తమ స్నేహంపై ఎలాంటి ప్రభావం చూపదని అన్నారు. బీహార్ రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్డీయేలో చేరామని, భవిష్యత్తులోనూ భాస్వామ్యాన్ని కొనసాగిస్తామని చెప్పారు.
2013లో నరేంద్రమోడీని ఎన్డీయే ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడంతో నితీశ్ కుమార్ బీజేపీతో 17ఏళ్ల బంధాన్ని తెంచుకున్నారు. గోద్రా అల్లర్లలో మోడీపై ఆరోపణల నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. బీజేపీతో తెగదెంపుల అనంతరం 2014 సార్వత్రిక ఎన్నికల్లో సీపీఐతో కలిసి పోటీ చేసిన నితీశ్ చావుదెబ్బ తిన్నారు. లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాభవానికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో లాలూ ప్రసాద్ నేతృత్వంలోని ఆర్జేడీతో జతకట్టిన జేడీయూ సంచలనం సృష్టించింది. శాసనసభ ఎన్నికల్లో విజయదుందుబి మోగించి ఆర్జేడీతో కలిసి బీహార్లో ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
2017లో దాణాకుంభకోణం కేసులో లాలూ జైలు పాలవడంతో బీజేడీ - ఆర్జేడీ మధ్య పొత్తు పెటాకులైంది. లాలూతో తెగదెంపుల అనంతరం నితీశ్ మళ్లీ బీజేపీతో జతకట్టారు. తాజాగా జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసిన జేడీయూ.. 17 సీట్లలో 16 తన ఖాతాలో వేసుకుంది. భారీ సంఖ్యలో ఎంపీలు ఉన్నందున మోడీ కేబినెట్లో ప్రాధాన్యం లభిస్తుందని, కనీసం రెండుమూడు మంత్రి పదవులు వస్తాయని భావించిన నితీశ్కు చుక్కెదురైంది.