టీ బిల్లు వాయిదా: కమల్నాథ్, జవదేకర్ మాటకు మాట
సీమాంధ్రకు ఐదేళ్ల ప్రత్యేక ప్రతిపత్తి కల్పించాలని కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రధాని మన్మోహన్ సింగ్ను కోరినట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇందుకు బిజెపి కూడా అంగీకరించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. దీంతో రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదం లాంఛనప్రాయమే అవుతుందని భావిస్తున్నారు. కాగా, బుధవారం జరగాల్సిన మంత్రి వర్గ సమావేశం రేపటికి వాయిదా పడింది.
అయితే, బిజెపి వైఖరిని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్ నాథ్ తప్పు పట్టారు. సీమాంధ్ర లోటుపై ప్రకటన చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. రేపు సభలో ఏం జరుగుతుందో చూద్దామని ఆయన అన్నారు. బిజెపి లోకసభలో ఓ రకంగా వ్యవహరించి, రాజ్యసభలో మరో రకంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు.
లోకసభలో బిజెపి ఆర్థిక ప్యాకేజీకి సంబంధించి ఏ విధమైన డిమాండ్లు పెట్టలేదని, రాజ్యసభలో మాత్రం పెడుతోందని ఆయన అన్నారు. లోకసభలో సవరణలను ఆమోదించిన బిజెపి, ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తోందని ఆయన అడిగారు. 24 గంటల్లో బిజెపి నాయకులు వైఖరి ఎందుకు మార్చుకున్నారని ఆయన అడిగారు.
కాగా, కమల్నాథ్ వ్యాఖ్యలకు ధీటుగా సమాధానం చెప్పడానికి బిజెపి నాయకుడు ప్రకాష్ జవదేకర్ ప్రయత్నించారు. రెండు ప్రాంతాలకు న్యాయం జరగాలన్నదే తమ అబిమతమని ఆయన అన్నారు. సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ కోరుతుంటే ఇప్పుడెందుకు అడుగుతున్నారని సోనియా అంటున్నారని ఆయన గుర్తు చేస్తూ ఈ విషయం కాంగ్రెసుకు చెందిన ముఖ్యమంత్రి ముందు నుంచే అడుగుతుంటే ఎందుకు పట్టించుకోలేదని ఆయన అడిగారు. ఇది కాంగ్రెసు ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఆయన అన్నారు.