ఈ సమావేశాల్లోనే టి బిల్లును ఆమోదిస్తాం: కమల్నాథ్
న్యూఢిల్లీ: రాబోయే పార్లమెంటు సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును ఆమోదిస్తామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్నాథ్ చెప్పారు. జాతీయ మీడియాతో ఆయన శుక్రవారం ఈ విషయం చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సమావేశాల్లో తెలంగాణ బిల్లను ఆమోదిస్తామని, అవసరమైతే పార్లమెంటు సమావేశాలను పొడగిస్తామని ఆయన చెప్పారు. ఈ మేరకు టీవీ చానెళ్లలో వార్తలు వచ్చాయి. కాగా, శుక్రవారం ఉదయం కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ చెప్పిన విషయాల నేపథ్యంలో కమల్ నాథ్ ప్రకటన ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
తాను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో మాట్లాడానని, చర్చ పూర్తయితే తెలంగాణ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని తాము నిలబెట్టుకుంటామని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ శుక్రవారం న్యూఢిల్లీలో చెప్పారు. బిల్లు పైన చర్చ వీలైనంత త్వరగా ముగించాలన్నారు. కిరణ్తో మాట్లాడానని, వీలైనంత త్వరగా బిల్లుపై చర్చ ముగించాలని చెప్పానని తెలిపారు.
పార్లమెంటు సమావేశాలు ఫిబ్రవరి 5వ తేదీ నుంచి ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. ఈ సమావేశాలు ఫిబ్రవరి 21వ తేదీ వరకు జరుగుతాయి. ఈ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును ప్రతిపాదించాలని కాంగ్రెసు అధిష్టానం ఆలోచిస్తుండగా, బిల్లుపై శాసనసభలో చర్చకు గడువును పెంచాలని కోరుతూ జాప్యం చేయాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి యోచిస్తున్నారు. ఈ స్థితిలో బిల్లుపై శాసనసభలో చర్చకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నాలుగు వారాల గడువు కోరగా, రాష్ట్రపతి ఈ నెల 30వ తేదీ వరకు గడువు ఇచ్చారు.
గడువును పెంచాలని మరోసారి కోరేందుకు ముఖ్యమంత్రి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కాగా, శానససభలో చర్చకు గడువును పెంచాలని కోరుతూ శాసనసభలో తీర్మానం ప్రతిపాదించాలని సీమాంధ్ర తెలుగుదేశం సభ్యులు స్పీకర్ నాదెండ్ల మనోహర్కు విజ్ఞప్తి చేసేందుకు సిద్ధపడుతున్నారు. కాంగ్రెసు అధిష్టానం ఒత్తిడి తెచ్చి రాష్ట్రపతి చేత కేవలం వారం రోజులు గడువు మాత్రమే పెంచేలా చూశారని కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్, రాయపాటి సాంబశివ రావు ఆరోపిస్తున్నారు.
రాష్ట్ర విభజన బిల్లుపై చర్చ విషయంలో రాష్ట్రపతిపై నూటికి రెండు వందల శాతం ఒత్తిడి తెచ్చారని గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు విమర్శించారు. బిల్లుపై శాసనసభలో చర్చకు వారం రోజులకు మించి గడువు ఇవ్వకుండా చేశారని ఆయన అన్నారు. సభ్యులందరూ అభిప్రాయాలు చెప్పేందుకు సమయం ఇవ్వకపోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు.
రాష్ట్ర విభజన జరగదనే తాను భావిస్తున్నట్లు తెలిపారు. విభజన జరిగితే కొత్త పార్టీ రావచ్చునని ఆయన అన్నారు. చివరి వరకు సమైక్యం కోసం పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. విభజన బిల్లును పార్లమెంటులో అడ్డుకునేందుకు తమ వ్యూహాలు తమకు ఉన్నాయని రాయపాటి అన్నారు.