అబద్ధపు పాలనపై గెలిచా: తబస్సుమ్, యూపీ నుంచి తొలి ముస్లిం మహిళా ఎంపీగా..
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అధికార బీజేపీకి మరోసారి ఉపఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది. గోరఖ్పూర్, ఫూల్పూర్ ఉపఎన్నికలో ఓటమిపాలైన తర్వాత ప్రతిష్టాత్మక కైరానా నియోజకవర్గంలోనూ బీజేపీకి ఓటమి తప్పలేదు. అయితే, ప్రతిపక్షాలన్నీ ఏకమై ఉమ్మడి మద్దతుతో అభ్యర్థిని నిలబెట్టడంతోనే ఇది సాధ్యమైంది.
రాష్ట్రీయ లోక్ దళ్(ఆర్ఎల్డీ) అభ్యర్థి తబస్సుమ్ హసన్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఆమెకు కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్వాదీ పార్టీ(బీఎస్పీ)తోపాటు ఆప్, సీపీఐ కూడా మద్దతు తెలపడం గమనార్హం. బీజేపీ అభ్యర్థి మృగాంక సింగ్పై హసన్ దాదాపు 50వేల ఓట్లకు పైగా మెజారిటీతో గెలుపొందారు.
అంతేగాక, 2014 తర్వాత ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి లోకసభకు ఎన్నికైన ముస్లిం మహిళగా తబస్సుమ్ నిలిచారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇది నిజమైన గెలుపని, అందరి మద్దతుతో తాను గెలిచానని, వాళ్లందరికీ కతజ్ఞతలని తెలిపారు. ఇతర పార్టీల నేతలు కూడా తనకు మద్దతు తెలిపారని, ఇది నాలుగేళ్ల అబద్ధంపై గెలుపు అని ఆమె చెప్పారు. ఇది ప్రతిపక్ష ఐక్యతకు ఇది నాంది అని అన్నారు. అయితే, భవిష్యత్లో జరగనున్న ఎన్నికలకు ఈవీఎంలు ఉపయోగించకూడదని ఆమె డిమాండ్ చేశారు.
2009లో హసన్ తొలిసారి లోకసభ ఎన్నికల్లో బీఎస్పీ తరపున పోటీ చేసి.. బీజేపీ అభ్యర్థి చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత బీఎస్పీని వీడి సమాజ్వాదీ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో కైరానా స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి హుకుమ్ సింగ్కు వ్యతిరేకంగా ఆమె తన కొడుకు నహిద్ను నిలబెట్టారు. అయితే, బీజేపీ అభ్యర్థి హుకుమ్ సింగ్ గెలుపొందారు. ఇటీవల హుకుమ్ సింగ్ మరణంతో కైరానాకు ఉప ఎన్నిక జరిగింది. ఆర్ఎల్డీ నుంచి పోటీ చేసిన తబస్సుమ్.. హుకుమ్ సింగ్ కుమార్తె, బీజేపీ అభ్యర్థి మృగాంక సింగ్పై గెలుపొందారు.