కరోనా: మర్కజ్ చీఫ్ మరో సంచలనం.. వైరస్ వ్యాప్తి అందుకేనంటూ.. తబ్లీగీ జమాత్ ఏంటో తెలుసా?
ప్రపంచం తలకిందులైనా ముస్లింలు సామూహిక ప్రార్థనలు ఆపకూడదని, మైనార్టీల ఐక్యతను దెబ్బతీసేందుకే కరోనా వైరస్ అనే కుట్రను తెరపైకి తెచ్చారంటూ అనూహ్య వ్యాఖ్యలు చేసిన ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ చీఫ్ మౌలానా సాద్ అజ్ఞాతంలో ఉంటూనే గురువారం తాజాగా మరో ఆడియో విడుదల చేశారు. ఎప్పటిలాగే ఈసారి కూడా సంచలన కామెంట్లు చేశారు.
పోలీసుల గాలింపు..
దేశంలోనే అతి పెద్ద కరోనా వైరస్ హాట్ స్పాట్ గా తేలింది ఢిల్లీ నిజాముద్దీన్ లోని మర్కజ్ మసీదు. లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా అక్కడ సామూహిక ప్రార్థనలు నిర్వహించడం.. విదేశాల నుంచి వచ్చినవాళ్ల ద్వారా వేల మందికి వైరస్ సోకడం.. దానికి కారణమైన బాధ్యులపై పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత మర్కజ్ చీఫ్ పరారైపోయారు. గుర్తుతెలియని ప్రాంతంలో ఉంటూ ఒక్కొక్కటిగా ఆడియోలు విడుదలచేస్తున్నారు. పలు మీడియా సంస్థల ద్వారా సదరు టేపులు బహిర్గతమవుతున్నాయి. ఆయన కోసం ఢిల్లీ, యూపీ పోలీసులు గాలిస్తున్నారు. ఇంతకీ ఆయనేం చెప్పారంటే..
మనవల్లే ఇదంతా..
ప్రపంచమంతటా విలయం సృష్టిస్తోన్న కరోనా వైరస్ ధాటికి ఇప్పటికే 50వేల మంది చనిపోగా, మరో 10 లక్షల మంది వ్యాధితో బాధపడుతున్నారు. ఇండియాలో గురువారం నాటికి 69 మంది ప్రాణాలుకోల్పోగా, 2474 మందికి పాజిటివ్ అని తేలింది. దాదాపు అన్ని దేశాల్లో ఇదేరకమైన విపత్కర పరిస్థిత నెలకొనడానికి మర్కజ్ చీఫ్ తనదైన కారణం చెప్పారు. మనుషజాతి అడ్డూఅదుపు లేకుండా పాపాలు చేస్తున్నందువల్లే ఈ మహమ్మారి పుట్టుకొచ్చిందని ఆయన సూత్రీకరించారు.
దేవుడికి ఆగ్రహం..
‘‘ఇందులో సందేహానికి తావు లేవు. కచ్చితంగా మనుషులు చేసిన పాపాలకు శిక్షగానే ఈ వైరస్ వ్యాప్తి చెందింది. భగవంతుడు మనపై చూపించిన ఆగ్రహానికి ప్రతిరూపం ఇది''అని సాద్ చెప్పుకొచ్చారు. అంతకుముందు ఆడియోలో ఆయన, కరోనాతో చనిపోయిన వాళ్లంతా దేవదూతలవుతాయని, నిజంగా దేవుడే వాళ్లందరినీ(మృతులను) సంక్షణలోకి తీసుకున్నానని చెబితే డాక్టర్లతోపాటు ప్రపంచంలో ఏ శక్తీ వ్యతిరేకించలేదని పేర్కొన్నారు. డాక్టర్లు చెప్పినట్లు సామాజిక దూరం పాటించేకంటే సామూహిక ప్రార్థనల కోసం చనిపోవడమే మంచిదని ఆయన చెప్పడం వివాదాస్పదమైంది.
అంతలోనే యూ-టర్న్
ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ ఉదంతం వెలుగులోకి వచ్చిన తర్వాత పరారైన మౌలానా సాద్.. తాను సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నానని, మర్కజ్ లో ప్రార్థనలకు వచ్చినవాళ్లంతా ఆయా ప్రభుత్వాల ఆదేశాలు పాటించి, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అంతకుముందు, క్వారంటైన్ ద్వారా ముస్లింలను వేరు చేయడానికి, సామూహిక ప్రార్థనల్ని నిలువరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ఒక రోజు వ్యవధిలోనే ఆయన యూటర్న్ తీసుకున్నారు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన మర్కజ్ మూలాల్లోకి వెళితే..
ఎవరీ మౌలానా సాద్?
మర్కజ్ చీఫ్ గా వార్తల్లో నిలిచిన మౌలానా సాద్ పూర్తిపేరు.. మౌలానా మహ్మద్ సాద్ కంద్లావీ. ఈ 54 ఏళ్ల మత గురువు.. మన దేశంలోని ముస్లిం స్కాలర్లలో ప్రముఖుడు. అంతేకాదు, ఇండియాలో తబ్లీక్ జమాత్ ను మొట్టమొదట ప్రారంభించిన మొహ్మద్ ఇలియాజ్ కంద్లావీకి మునిమనవడు కూడా. మెయిన్ స్ట్రీమ్ మీడియాకు దూరంగా ఉంటూ, తన పని తాను చేసుకుపోయే ఆయన.. మర్కజ్ మసీదు వైరస్ హాట్ స్పాట్ గా మారడంతో ఒక్కసారిగా చర్చనీయాంశమయ్యారు. అన్ని వేల మంది అక్కడ ఎందుకు కూడుకున్నారంటే..
Recommended Video
తబ్లీగీ జమాత్ అంటే..
లౌకిక, సంసారిక జీవితంలో పడిపోయి.. ఇహలోక సుఖాలనే సర్వస్వం అని భావించే మనిషి.. క్రమంగా దేవుడికి దూరమైపోతాడు. అలాంటి దైనందిన జీవితానికి కాస్త బ్రేకిచ్చి.. మళ్లీ దేవుడివైపు దృష్టి మరల్చేలా చేయాలన్నదే తబ్లీగీ జమాత్ సిద్ధాంతం. ఆయా ప్రాంతాల్లోని ముస్లింలు జట్లుగా ఏర్పడి.. వేరే ప్రాంతాలకుగానీ, సుదూరాలకుగానీ వెళ్లి.. అక్కడి పెద్ద మసీదులో(దీన్నే మర్కజ్ మసీదుగా వ్యవహరిస్తారు) ఉంటూ.. దైవసందేశాలు వినడం, ఖురాన్ పఠించడం, ఆ కొత్త ప్రదేశంలోని ముస్లింలతో మమేకం కావడంలాంటి పనులు చేస్తారు. ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో 1927 నుంచీ ఈ కార్యక్రమం కొనసాగుతున్నది. ఈ మోడల్ ను మన పొరుగుదేశాలు కూడా ఫాలో అవుతున్నాయి. తబ్లీగీ జమాత్.. మత మార్పిడుల జోలికి పోకుండా.. ముస్లింలను ఇస్లాంకు మరింత దగ్గరగా చేయడమనే కాన్సెప్ట్ తోనే పనిచేస్తుంది కాబట్టి ఆ వ్యవహారాలేవీ పెద్దగా వార్తల్లోకి రావు.