తబ్లీఘీ జమాత్ సభ్యులు అర్ధనగ్నంగా వేధించింది నిజమే .. పోలీసుల దర్యాప్తులో వెల్లడి
కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన తబ్లీఘీ జమాత్ సభ్యులు నానా హంగామా చేస్తున్నారన్న విషయం తెలిసిందే . ఇక అర్దనగ్నంగా తిరుగుతూ నర్సులను వేధించిన ఘటన వాస్తవమేనని ఘజియాబాద్ పోలీసుల దర్యాప్తులో తేలింది. ఉత్తరప్రదేశ్ లో కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన తబ్లిఘీ జమాత్ సభ్యులు అర్దనగ్నంగా తిరుగుతూ నర్సులను వేధిం చారని అందుకున్న ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసిన పోలీసులు ఈ ఘటన వాస్తవమేనని తమ విచారణలో గుర్తించారు.
క్వారంటైన్ లో ఉన్న ఆరుగురు సభ్యుల్లో ఐదుగురు సభ్యులు నర్సుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, వారు ఆసుపత్రిలో అర్దనగ్నంగా తిరుగుతూ అసభ్యకర వ్యాఖ్యలు కూడా చేశారని పోలీసులు తమ దర్యాప్తు నివేదికలో తెలిపారు. తబ్లీఘీ జమాత్ సభ్యులపై నర్సుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు సెక్షన్ 269, 270, 271, 294, 354 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు. ఇక తాము జరిపిన దర్యాప్తు నివేదికను జిల్లా మెజిస్ట్రేట్ కు సమర్పించారు . నర్సుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఐదుగురు జమాత్ నిందితులపై ఘజియాబాద్ పోలీసులు జాతీయ భద్రతా చట్టం కింద కూడా కేసులు నమోదు చేశారు.
కరోనా వైరస్ అనుమానితులు ఆసుపత్రిలో ఫ్యాంటు లేకుండా తిరిగారని , అసభ్యకరమైన పాటలు పాడుతూ, వికారమైన హావభావాలుప్రదర్శించారని వారి వద్ద విధులు నిర్వర్తిస్తున్న నర్సులు తమ ఫిర్యాదులో తెలిపారు. ఇక అంతే కాదు కరోనా అనుమానితులు వైద్యానికి సహకరించడం లేదన్నారు. సామాజిక దూరం పాటించాలనే నిబంధనలు పాటించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే పోలీసులు దర్యాప్తు చేసి వారు అసభ్యంగా ప్రవర్తించింది నిజమేనని తేల్చారు .అనంతరం ఆరుగురు జమాత్ సభ్యులను ఆసుపత్రి నుంచి ఓ ప్రైవేటు విద్యాసంస్థలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డుకు తరలించారు. నర్సులను వేధించిన కరోనా అనుమానితులపై కఠినచర్యలు తీసుకుంటామని సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ కళానిధి నైతానీ తెలిపారు. ఎట్టి పరిస్థితిలోనూ ఇలాంటి చర్యలు సహించబోమని పోలీసులు పేర్కొన్నారు.