కరోనా:వ్యాధి రావడం నేరం కాదు, వ్యాపింపజేయడం మాత్రం నేరమే: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మార్చి నెలలో ఢిల్లీలో జరిగిన తబ్లిగి జమాత్ ప్రార్థనలతోనే దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగాయని, ఇందుకు తబ్లిగి బాధ్యత వహించాలని కోరారు.. శనివారం ఆయన ఈ అజెండా ఆజ్'తాక్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మత ప్రార్థనలకు హాజరైన వారి నుంచి వైరస్ వ్యాప్తి చెందిందని ఆరోపించారు. తబ్లిగి చేసిన చర్య ఖండించిన దగినదని పేర్కొన్నారు. వారు అలా చేయకుంటే తొలి దఫా విధించిన లాక్డౌన్ వల్ల దేశంలో కరోనా వైరస్ అదుపులోకి వచ్చేదని తెలిపారు. కానీ తబ్లిగి జమాత్ నేరపూరితమైన చర్యకు పాల్పడిందని మండిపడ్డారు.
ఢిల్లీలో జరిగిన మత ప్రార్థనలకు యూపీ నుంచి 3 వేల మంది హాజరయ్యారని యోగి ఆదిత్యనాథ్ వివరించారు. వాస్తవానికి ఒక వ్యాధి రావడం నేరం కాదు.. కానీ వ్యాధి వ్యాపించేందుకు కారణం అవడం మాత్రం నేరమని పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన తబ్లిగికి సంబంధించి నిబంధనలను ఉల్లంఘించిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని యోగి ఆదిత్యనాథ్ స్పష్టంచేశారు.
యూపీలో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగానే ఉంది. శనివారం నాటికి యూపీలో 2 వేల 338 పాజిటివ్ కేసులు ఉండగా.. 654 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 42 మంది చనిపోయారు. మార్చి నెలలో ఆగ్రాలో మొదటి కరోనా వైరస్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. యూపీలో రెడ్ జోన్ పరిధిలో 19 జిల్లాలు ఉన్నాయి. 36 జిల్లాలు ఆరంజ్ జోన్లో ఉండగా.. 20 జిల్లాలు గ్రీన్ జోన్లో ఉన్నాయి. ఆగ్రా, లక్నో, గౌతమ్ బుద్ద్ నగర్, ఘజియాబాద్, మొరదాబాద్లో ప్రభావం ఎక్కువగా ఉంది.