నా భార్య గురించి అడగొద్దు: ముంబై కోర్టు విచారణలో హెడ్లీ
ముంబై: ముంబై 26/11 దాడి కేసులో అప్రూవర్గా మారిన పాక్-అమెరికన్ ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ విచారణ బుధవారం ప్రారంభమైంది. వీడియా కాన్ఫరెన్స్ ద్వారా ముంబై కోర్టు అతడిని విచారిస్తోంది. తన వ్యక్తిగత అంశాలపై విచారణకు అభ్యంతరం తెలిపిన డేవిడ్ హెడ్లీ 2002 తర్వాత అరేబియా, పాకిస్థాన్ దేశాల్లో తాను పెట్టుబడులు పెట్టినట్లు డేవిడ్ హెడ్లీ తెలిపాడు.
అబూ జుందాల్ లాయర్ అబ్దుల్ వహాబ్ ఖాన్, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ సమక్షంలో హెడ్లీని విచారించారు. ముంబై క్రైం బ్రాంచ్ చీఫ్ అతుల్ కులకర్ణి కూడా ఈ విచారణలో పాల్గొన్నారు. ఈ విచారణ మధ్యాహ్నం వరకు కొనసాగింది. అంతేకాదు డ్రగ్స్, అక్రమ ఆయుధ వ్యాపారాన్ని కూడా నిర్వహించానని డేవిడ్ హెడ్లీ బుధవారం నాటి విచారణలో ఒప్పుకున్నాడు.
తన భార్య షాజియా గిలానీ గురించిన సమాచారాన్ని వెల్లడించేందుకు మాత్రం నిరాకరించాడు. తన గురించి అడగాలని, తన భార్య గురించి మీకెందుకని విచారణ అధికారులను ఎదురు ప్రశ్నించాడు. తనకు లష్కరే తాయిబాతో సంబంధాలు ఉన్న విషయం తన భార్యకు తెలుసని అన్నాడు. పాక్కు చెందిన జెబ్ షా అనే వ్యక్తి అక్కడి డ్రగ్ వ్యాపారానికి సహకరించాడని తెలిపాడు.
అతనితో కలిసే 2006లో భారత్లోకి అక్రమ ఆయుధ వ్యాపారానికి తెరతీసినట్టు తెలిపారు. 1992 వరకు డ్రగ్స్ వ్వాపారం చేసినట్లు తెలిపాడు. 1988లో జైలు నుంచి విడుదలైన తర్వాత తిరిగి 1998లో మళ్లీ జైలుకు వెళ్లేదాగా డ్రగ్స్ వ్యాపారాన్ని కొనసాగించినట్టు హెడ్లీ తెలిపాడు. అయితే అంతర్జాతీయ ఉగ్రవాద సంస్ధ లష్కర్ ఈ తోయిబా నుంచి తనకు నిధులు అందలేదని, తానే వారికి నిధులు సమకూర్చినట్లు వెల్లడించాడు.
కాగా పాకిస్థాన్లోని లాహోర్లో ఉన్నప్పుడు తాను పంజాబీ నేర్చుకున్నానని తలిపాడు. ఇదిలా ఉంటే మరో లష్కర్ ఈ తోయిబా ఉగ్రవాది తహావుర్ రానాతో తనకు పరిచయం ఉన్నట్లు హెడ్లీ విచారణలో అంగీకరించాడు. కాగా లష్కర్ ఈ తోయిబాతో రానాకు సంబంధాలు లేవని పేర్కొన్నాడు. 26/11 ముంబై దాడుల సందర్భంగా ఆయన కార్యాలయాన్ని వాడుకున్నామని తెలిపాడు.
ముంబై ఉగ్రదాడికి ప్రణాళిక వేయడంలో హెడ్లీకి రానా సహకరించాడన్న ఆరోపణలున్నాయి. ఆ తర్వాత రానా తనని కార్యాలయం నుంచి బయటకు గెంటివేసినట్లు చెప్పాడు. సుమారు నాలుగు రోజుల పాటు హెడ్లీని ముంబై కోర్టు విచారించనుంది. ముంబై 26/11 ఉగ్రదాడి సమయంలో లష్కర్ ఈ తోయిబా ముంబై ఎయిర్ పోర్ట్ని కూడా టార్గెట్ చేసినట్లు వెల్లడించాడు.