కుర్చీలు బల్లలే లేనోళ్లు.. తాజ్మహల్ మీదంటారా?: వక్ఫ్ బోర్డుపై టూసీ
న్యూఢిల్లీ: తాజ్మహల్ను తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్న సున్నీ వక్ఫ్ బోర్డుకి మొఘల్ సామ్రాజ్య ఆఖరి చక్రవర్తి అయిన బహుదూర్ షా జఫర్ మునిమనవడు వైహెచ్ టూసీ గట్టి కౌంటర్ ఇచ్చారు. తాజ్మహల్ దేశం సొత్తని దీనిపై ఎవ్వరికీ వ్యక్తిగత హక్కు లేదని ఆయన అన్నారు.
అంతేకాదు, సున్నీ వక్ఫ్ బోర్డు భూకబ్జాలకు పాల్పడుతోందని టూసీ ఆరోపించారు. సున్నీ వక్ఫ్ బోర్డు కార్యాలయాల్లో ఇప్పటికీ కుర్చీలు, బల్లలు కూడా లేవని, అలాంటి సంస్థ తాజ్మహల్ను దక్కించుకుషని ఏం కాపాడుతుందని ప్రశ్నించారు.
తాజ్మహల్ మాదే.. షాజహాన్ మాకు రాసిచ్చాడు: సున్నీ వక్ఫ్ బోర్డు
కేవలం మీడియా దృష్టిని ఆకర్షించేందుకే.. వారు ఇదంతా చేస్తున్నారని, హిందు-ముస్లింల మధ్య విబేధాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు.తాజ్మహల్ విషయంలో రాజకీయాలు వద్దని, అది జాతి సంపద అని ఆయన గుర్తుచేశారు.
అయోధ్యపై టూసీ:
అయోధ్యలో రామ మందిర నిర్మాణంపై కూడా ఆయన మాట్లాడారు. 'ఆలయ నిర్మాణాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. అన్ని మతాల వారిని దగ్గరచేసే ఏ కార్యక్రమానికైనా నా మద్దతు ఉంటుంది' అని టూసీ తెలిపారు.
ఆదివారంతో ముగిసిన 'యువర్స్ షాజహాన్' కార్యక్రమానికి హిందు మహాసభ కార్యకర్తలతో పాటు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను ఆహ్వానించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి మొత్తం 35వేల మంది హాజరైనట్టు సమాచారం.