'దాని ప్రకారం తాజ్ మహల్లో శివాలయం లేదు'
తాజ్ మహల్ గుడి కాదని, సమాధి మాత్రమేనని భారత పురాతత్వ పరిశోధన సంస్థ (ఏఎస్ఐ) స్పష్టం చేసింది.ఈ మేరకు ఆగ్రా కోర్టులో అఫిడవిట్ సమర్పించింది. ఇలా వెల్లడించడం ఇదే తొలిసారి.
లక్నో: తాజ్ మహల్ గుడి కాదని, సమాధి మాత్రమేనని భారత పురాతత్వ పరిశోధన సంస్థ (ఏఎస్ఐ) స్పష్టం చేసింది. ఈ మేరకు ఆగ్రా కోర్టులో అఫిడవిట్ సమర్పించింది. ఇలా వెల్లడించడం ఇదే తొలిసారి.
తాజ్మహల్ పరిరక్షణకు సంబంధించి 1920లో జారీ అయిన నోటిఫికేషన్ ఆధారంగా ప్రమాణపత్రం సమర్పించినట్లు అధికార వర్గాల సమాచారం. తాజ్లో ఆలయం ఉందనేందుకు ఎలాంటి ఆధారం లేదని 2015 నవంబర్లో కేంద్ర సాంస్కృతిక శాఖ లోకసభలో వివరణ ఇచ్చింది.
తాజ్మహల్ అనేది తేజో మహాలయగా పిలిచే శివాలయమని, ఆవరణలోకి హిందూ భక్తులనూ అనుమతించాలంటూ 2015 ఏప్రిల్లో ఆరుగురు న్యాయవాదులు వేసిన వ్యాజ్యాన్ని ఆగ్రా జిల్లా కోర్టు అనుమతించింది.
దీనిపై ప్రతిస్పందన తెలపాలంటూ కేంద్ర ప్రభుత్వం, కేంద్ర సాంస్కృతిక, హోం శాఖలు, ఏఎస్ఐకి నోటీసులు జారీచేసింది. ఏఎస్ఐ తన స్పందనను కోర్టుకు సమర్పించింది.
స్థానిక కోర్టు పరిధిని, దావాదారుల జోక్యం చేసుకునే హక్కును ఏఎస్ఐ సవాలు చేసింది. తమ ప్రతిస్పందనను సమర్పించేందుకు దావా వేసిన వ్యక్తులకు సెప్టెంబర్ 11వరకూ కోర్టు గడువు ఇచ్చింది.
చారిత్రకంగా, అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం ఆగ్రాలో యమునా నది ఒడ్డున తాజ్ మహల్ పేరిట ప్రాచీన కట్టడం ఉందనీ, అది జాతీయ ప్రాధాన్యం ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించిందనీ, ఏడో వింతగా ప్రపంచవ్యాప్తంగా పేరొందిందని ఏఎస్ఐ తెలిపింది.
బ్రిటిష్ హయాం 1904 నుంచి అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం.. 1920 డిసెంబర్ 22న జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం తాజ్ రక్షిత కట్టడంగా ప్రకటించారని ప్రమాణపత్రంలో తెలిపింది.
తాజ్మహల్లో గుడిగానీ, శివలింగంగానీ లేదని స్పష్టం చేసింది. పిటిషన్దారుల వాదనకు ఎలాంటి ఆధారం లేదనీ, ఊహల్లో నుంచి పుట్టిన కల్పనగా పేర్కొంది. హరిశంకర్ జైన్ తదితర న్యాయవాదులు ఈ పిటిషన్ను దాఖలు చేశారు.
పిటిషన్దారుల తరఫు న్యాయవాది రాజేష్ కులశ్రేష్ఠ మాట్లాడుతూ.. ఏఎస్ఐ దాఖలు చేసిన ప్రతిస్పందన ఆధారరహితమన్నారు. అందులో సమర్పించిన పలు వాస్తవాలు వైరుద్ధ్యంగా ఉన్నాయన్నారు.