అదేమైనా పవిత్ర పూజా స్థలమా?: తాజ్ మహల్ పై వక్ఫ్ బోర్డు చైర్మన్ సంచలన వ్యాఖ్యలు
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కట్టడం తాజ్మహల్పై వివాదాస్పద వ్యాఖ్యల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా యూపీ షియా వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ వసీం రిజ్వీ కూడా తాజ్ మహల్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
న్యూఢిల్లీ: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కట్టడం తాజ్మహల్పై వివాదాస్పద వ్యాఖ్యల పరంపర కొనసాగుతూనే ఉంది. దీనిని విమర్శిస్తున్న వారిలో తాజాగా యూపీ షియా వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ వసీం రిజ్వీ కూడా వచ్చి చేరారు.
తాజ్మహల్ పవిత్ర పూజా స్థలం కాదని ఆయన పేర్కొన్నారు. మొఘల్ రాజులు అయ్యాష్ (జల్సాపురుషులు) అని వ్యాఖ్యానించారు. తాజ్మహల్ ప్రేమకు మాత్రమే చిహ్నమని పూజకు కాదని వసీం రిజ్వి అన్నారు.
అంతేకాదు, ఒకరిద్దరు తప్ప మొఘల్ రాజులందరూ జల్సారాయుళ్లేనని, వారిని ముస్లింలు ఆదర్శ పురుషులుగా భావించరని కూడా వ్యాఖ్యానించారు. అలాగే అయోధ్యలో రాముడి విగ్రహ నిర్మాణం విషయంలో ఏర్పడిన వివాదంపై కూడా రిజ్వీ సానుకూలంగా మాట్లాడారు.
''హిందూ మత ప్రాచీన వైభవానికి అయోధ్య ఒక ప్రతీక కాబట్టి.. అక్కడ 100 మీటర్ల ఎత్తైన శ్రీరాముడి విగ్రహాన్ని నిర్మించడంతో తప్పేం లేదు.. మాయావతి సొంతగా తన విగ్రహం చేయించుకున్నప్పుడు ఎవరూ మట్లాడలేదు.. ఇప్పడు ఈ విషయాన్ని ఎందుకు వివాదాస్పదం చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు..'' అని ఆయన వ్యాఖ్యానించారు.త
మరోవైపు తాజ్ మహల్ ను తప్పక పరిరక్షిస్తామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. గోరఖ్పూర్లో మంగళవారం ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సీఎం తాజ్మహల్ను భరతమాత పుత్రుల రక్తం, స్వేదంతో నిర్మించారని, దానిని కాపాడే బాధ్యత యూపీ సర్కార్పై ఉందని పేర్కొన్నారు.
ఈనెల 26న తాను స్వయంగా ఆగ్రాకు వెళ్లి అక్కడి పర్యాటక పథకాలను కూడా పరిశీలిస్తానని సీఎం యోగి తెలిపారు. తాజ్ పర్యాటకులకు సరైన భద్రత, వసతులను కల్పించాల్సిన బాధ్యత తమదేనన్నారు.