తాజ్మహల్ను కూల్చేయండి: యోగికి మద్దతంటూ ఆజంఖాన్ సంచలనం
లక్నో: ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉండే సమాజవ్వాదీ పార్టీ సీనియర్ నేత ఆజం ఖాన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ ప్రఖ్యాత కట్టడమైన తాజ్ మహల్ తోపాటు ఎర్రకోట, పార్లమెంటు భవనాలను కూల్చివేయాలని అన్నారు.
ఇటీవల విడుదల చేసిన పర్యాటక ప్రాంతాల జాబితాలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తాజ్ మహల్ను పేర్కొనలేదు. దీంతో సీఎం యోగి ఆదిత్యనాథ్పై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే ఆజంఖాన్ కూడా స్పందించడం గమనార్హం.
తాజ్మహల్ను కూల్చివేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయిస్తే తాను పూర్తి మద్దతు ఇస్తానని ఆజంఖాన్ ప్రకటించారు. అంతేగాక, రాష్ట్రపతి భవన్, పార్లమెంటు, ఎర్రకోటలను కూడా కూల్చివేయాలని డిమాండ్ చేశారు. ఈ భవనాలు బానిసత్వానికి ప్రతీకలని, వాటిని కూల్చివేయాలని ఆజంఖాన్ వ్యాఖ్యానించారు.
అయితే, గతంలో కూడా ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. తాజ్ మహల్ను కూల్చి శివాలయం నిర్మించాలని గతంలో వ్యాఖ్యానించారు. ప్రజాధనాన్ని భారీగా వృథా చేసిన స్మారక కట్టడాల్లో తాజ్ మహల్ ఒకటనీ, అక్కడ నిలబడాలంటేనే తనకు నచ్చదని ఆజంఖాన్ పేర్కొన్నారు. కాగా, అప్పటి ఎస్పీ ప్రభుత్వం నిబంధనలకు వ్యతిరేకంగా (రూ.40లక్షలు వెచ్చించి) నిర్మించిందంటూ ఆజంఖాన్కు ఇష్టమైన ఉర్దూ గేట్ను కూల్చేసేందుకు యోగి ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది.