300 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి.. ట్రంప్ పర్యటన కోసం తాజ్మహల్లో ఏం చేశారో తెలుసా..
అమెరికా అధ్యక్షుడి రెండు రోజుల పర్యటన కోసం భారత ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటుందో అందరికీ తెలిసిందే. అహ్మదాబాద్లో మురికివాడలు కనిపించకుండా గోడ కట్టడం మొదలు తాజ్మహల్లో సమాధులను కూడా శుభ్రం చేశారు. తాజ్మహల్ లోపల ఉన్న సమాధులను శుభ్రపరచం గత 300 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం. చిక్కటి మట్టిపూతతో వీటికి ట్రీట్మెంట్ చేసి డిస్టిల్ వాటర్తో శుభ్రపరిచారు. ఈ విషయాన్ని ఆర్కియాలజీ సర్వే అధికారులు వెల్లడించారు.
Recommended Video
అసలైన సమాధులు నేలమాళిగలో..
ఈ సమాధులు 17 వ శతాబ్దపు మొఘల్ చక్రవర్తి షాజహాన్, ఆయన అమితంగా ప్రేమించిన భార్య ముంతాజ్ మహల్ కు చెందినవి. నిజానికి ఇవి స్మారక నమూనాలు మాత్రమే. అసలైన సమాధులు తాజ్మహల్లోని నేలమాళిగలో ఉన్నాయి. సందర్శకులకు వీటిలోకి ప్రవేశం ఉండదు. చాలా అరుదుగా మాత్రమే నేలమాళిగ ప్రవేశ ద్వారాన్ని తెరుస్తుంటారు.
ఆ సమాధులను సందర్శించరన్న భద్రతా సిబ్బంది..
షాజహాన్ మరియు అతని భార్య యొక్క అసలు సమాధులను ట్రంప్ సందర్శించే అవకాశం లేదని ఆయన భద్రతా సిబ్బంది తెలిపారు. ఆ సమాధులను సందర్శించాలంటే.. ఐదడుగుల ఎత్తయిన ద్వారం గుండా వెళ్ళాల్సి ఉంటుందని.. తమ అధ్యక్షుడి ఎత్తు కారణంగా అందులోకి వెళ్లాలంటే తలవంచి లోపలికి వెళ్లాలని,అది తమకు ఇష్టం లేదని చెప్పారు.కేవలం గ్రౌండ్ ఫ్లోర్ను మాత్రమే ఆయన సందర్శిస్తారని చెప్పుకొచ్చారు.
ఫేస్ ప్యాక్ లాంటిదే ఆ ట్రీట్మెంట్..
తాజ్మహల్లోని సమాధులను శుభ్రం చేసే పద్దతి మహిళలు ఫేస్ ప్యాక్ వేసుకునే పద్దతిలోనే ఉంటుందని చెబుతున్నారు. మొదట చిక్కని మట్టిపూతతో ట్రీట్మెంట్ ఇచ్చి.. అది ఆరాక.. సున్నితమైన బ్రష్తో మట్టిని తొలగిస్తారని చెబుతున్నారు. ఆ తర్వాత డిస్టిల్ వాటర్తో పూర్తిగా శుభ్రం చేస్తారని చెబుతున్నారు. తాజ్మహల్లోని అసలైన సమాధులను చూసేందుకు ఏడాదిలో కేవలం మూడు రోజుల పాటే సందర్శకులకు అవకాశం కల్పిస్తారు. షాజహాన్ వర్దంతి సందర్భంగా ఈ ఏర్పాట్లు చేస్తారు.
తాజ్మహల్ను సందర్శించిన ట్రంప్ దంపతులు..
ఇదిలా ఉంటే, భారత పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అహ్మదాబాద్ పర్యటన ముగిసిన తర్వాత ఆగ్రాలోని తాజ్మహల్ను సందర్శించారు. భార్య మెలానియా ట్రంప్తో కలిసి తాజ్మహల్ పరిసరాల్లో అడుగుపెట్టిన ట్రంప్.. మొదట సందర్శకుల పుస్తకంలో(విజిటర్ బుక్)లో సంతకం చేశారు. 'తాజ్మహల్ అద్భుతమైన కట్టడం. అందమైన భారత సంస్కృతికి నిదర్శనం! థ్యాంక్యూ ఇండియా'అని అందులో రాశారు. ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ అల్లుడు కుష్నర్ కూడా తాజ్మహల్ అందాలను వీక్షించారు.