తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదు: ఆల్ఖైదా వీడియోపై భారత్ స్పందన
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చాలని భారత్పై దాడి చేయాలంటూ చెబుతూ ఆల్ఖైదా వీడియోపై భారత్ స్పందించింది. ఆల్ఖైదా తాటాకుల చప్పుళ్లకు భయపడేది లేదని భారత ప్రభుత్వం తెలిపింది. ఆల్ ఖైదా ఇంకా చాల చెప్పిందని వాటన్నిటిపై స్పందించలేమని తెలిపింది. ఆల్ఖైదా దాడులను తిప్పి కొట్టేందుకు భారత ఆర్మీ సిద్ధంగా ఉందని చెప్పారు రవీష్ కుమార్.
ఆల్ఖైదా చీఫ్ అయిమన్ అల్ జవహరీ విడుదల చేసిన వీడియోలో భారత్ను దాడులతో అతలాకుతలం చేయాలని ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేయాలని వీడియో ద్వారా సందేశం పంపాడు. కశ్మీర్లోని ముజాహిద్దీన్ సంస్థ భారత ఆర్మీపై దాడులు చేస్తుందని తాను భావిస్తున్నట్లు చెప్పాడు. ఈ వీడియో ఆస్ సహాబ్ ఛానెల్లో ప్రసారమైంది. ఆల్ఖైదా కార్యక్రమాలను ఈ ఛానెల్ ప్రసారం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరుల మధ్య కమ్యూనికేషన్ను బలోపేతం చేయాల్సిందిగా ఉగ్రవాదులకు పిలుపునిచ్చారు. అదేసమయంలో అమెరికా చేతిలో కీలుబొమ్మలా మారిన పాకిస్తాన్ను కూడా నమ్మడానికి వీలులేదని ఉగ్రవాదులకు జవహరీ పిలుపిచ్చాడు.
ఇదిలా ఉంటే అల్ఖైదా విడుదల చేసిన వీడియోను భారత ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించింది. అయితే కశ్మీర్లో శాంతియుత వాతావరణం నెలకొనడంతో కేవలం రెచ్చగొట్టేందుకు మాత్రమే ఈ వీడియోను ఆల్ఖైదా విడుదల చేసి ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. అయినప్పటికీ ఆర్మీ ముందస్తు జాగ్రత్తతో ఉందని స్పష్టం చేసింది. వీడియో విడుదలైనప్పటి నుంచి సరిహద్దుల్లో భారత ఆర్మీ భద్రతను మరింత పటిష్టం చేసింది. నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ అనుమానం ఉన్నవారిని అదుపులోకి తీసుకుంటోంది.