మిడ్ డే మీల్స్లో కూరకు బదులు ఉప్పు: వెలుగులోకి తెచ్చిన జర్నలిస్టుపైనే కేసు, అరెస్ట్!
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీర్జాపూర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాల వసతి గృహంలో మధ్యాహ్నం భోజనంలో కూరకు బదులు ఉప్పు వడ్డించిన ఘటనను వెలుగులోకి తెచ్చిన జర్నలిస్టు పవన్ జైశ్వాల్ను, ఆయనకు సహకరించిన గ్రామ పెద్దను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఫొటోలు తీసుకోవచ్చు కానీ, వీడియో ఎందుకు తీశారంటూ సంబంధిత అధికారులు సదరు జర్నలిస్టుపై ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం.
మధ్యాహ్న భోజనంలో కూరకు బదులు ఉప్పు: ఆ జర్నలిస్టుపైనే కేసుపెట్టారు!
ఆగస్టు 22న జనసందేశ్ టైమ్స్ హిందీ డైలీ జర్నలిస్టు పవన్ జైశ్వాల్ ఆ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం చేస్తున్న విద్యార్థుల ఫొటోలను, వీడియోలను తీశారు. ఆ వీడియోలో విద్యార్థులు రోటీలతోపాటు కూరకు బదులు ఉప్పును అద్దుకుని తింటున్నారు. ఎందుకంటే వసతి గృహం సిబ్బంది పిల్లలకు కూరకు బదులు ఉప్పును మాత్రమే వారి పల్లెంలో పెట్టడంతో అదే తిన్నారు.
ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చిన జర్నలిస్టును అభినందించకపోగా.. ఆయనపైనే అధికారులు చర్యలు తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. విషయం అధికారుల దృష్టికి తీసుకొస్తే సరిపోయేది కానీ.. వీడియోలు తీసి రచ్చ చేయాల్సిన అవసరం ఏముందని అధికారులు అంటున్నారు. ప్రభుత్వాన్ని నిందించడానికి సదరు జర్నలిస్టు ఇలాంటి పనిచేశాడంటూ మీర్జాపూర్ ఉన్నతాధికారు అనురాగ్ పటేల్ అతనిపై విచారణకు ఆదేశించారు.
కొందరు గ్రామస్తులు కావాలనే జర్నలిస్టును పిలిచి ఇలా చేయించారని సదరు అధికారి చెప్పారు. విద్యార్థులకు ఉప్పు వడ్డించడం లేదని, కూరలు వడ్డిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఏదో ఒక రోజు అలా జరిగి ఉండవచ్చని అన్నారు. కాగా, జర్నలిస్టును అరెస్ట్ చేయడంపై ఆగ్రహించిన ఇతర జర్నలిస్టులు మీర్జాపూర్ కలెక్టరేట్ వద్ద భారీ ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు.
ఇది ఇలా ఉండగా, విద్యార్థులకు కూరకు బదులు ఉప్పు వడ్డించడంపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులైన ఇద్దరు ఉద్యోగులను జిల్లా కలెక్టర్ విధుల నుంచి తొలగించారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని ఆదేశించారు.