తాలిబన్ బీజేపీ; మోడీ యూఎస్ వెళ్ళొచ్చు, నేను ఇటలీ వెళ్ళొద్దా? తనను ఎవరూ ఆపలేరన్న మమత
రోమ్లోని వాటికన్లో జరిగే ప్రపంచ శాంతి సమావేశానికి హాజరయ్యేందుకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) అనుమతి నిరాకరించడంపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సెప్టెంబర్ 30 న ఉప ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో భబానీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారంలో మమతా బెనర్జీ ప్రధాని మోడీపై విరుచుకుపడ్డారు . మీరు ఎన్ని చోట్లకు తనను వెళ్ళకుండా ఆపగలరు? ఎందుకు తనను ప్రపంచ శాంతి సదస్సుకు అనుమతించరు? మీరు తనను శాశ్వతంగా ఆపలేరు అంటూ విరుచుకుపడ్డారు.
మమతా బెనర్జీ ప్రపంచ శాంతి సదస్సుకు అనుమతి నిరాకరించిన కేంద్రం
ప్రపంచ శాంతి సమావేశానికి హాజరు కావడానికి విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆమెకు అనుమతిని నిరాకరించింది. ఆ సదస్సు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొనే స్థితికి అనుగుణంగా లేదని పేర్కొంది. ప్రపంచ శాంతి సమావేశం అక్టోబర్ 6 మరియు 7 తేదీలలో రెండు రోజుల పాటు ఇటాలియన్ రాజధానిలో జరుగుతుంది. పోప్ ఫ్రాన్సిస్ ఇటాలియన్ ప్రధాన మంత్రి మారియో డ్రాగీ, మదర్ థెరిస్సా ఆశయాల చుట్టూ కేంద్రీకృతమై ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. సమావేశానికి ఆహ్వానించబడిన ప్రముఖులలో జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ కూడా ఉన్నారు.భారతదేశం నుండి ఆహ్వానం అందుకున్న ఏకైక నాయకురాలు మమతా బెనర్జీ మాత్రమే.
ప్రపంచ శాంతి సదస్సుకు మమతకు ఆహ్వానం అందుకే
సమాజం కోసం ఆమె చేసిన మానవతా కృషికి గుర్తింపుగా ఆమెకు ఆహ్వానం అందింది. ఈ సమావేశంలో ఆమె ప్రసంగం కూడా చేయాల్సి ఉంది. అయితే, విదేశాంగ మంత్రిత్వ శాఖ నుండి అనుమతి లేకుండా ఆమె ఈ సదస్సుకు హాజరు కాలేరు. ఇటాలియన్ ప్రభుత్వం, ఆహ్వానాన్ని అందజేస్తూ, ఆమె ముఖ్యమైన ఎన్నికల విజయాన్ని ప్రస్తావించింది. అత్యంత శక్తివంతమైన మహిళగా ఆమెను పేర్కొంది. సామాజిక న్యాయం కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం ఆమె చేసిన కృషిని కొనియాడింది. పదేళ్లుగా చేస్తున్న శాంతి కోసం ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు.
సదస్సులో హిందూ సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తున్నది తాను మాత్రమేనన్న మమత
విదేశాంగ శాఖ అనుమతిపై మాట్లాడిన మమతా బెనర్జీ చాలా మంది ముఖ్యమంత్రులు విదేశాలకు వెళ్తే చాలా సందర్భాలలో అనుమతి తీసుకోలేదు. కానీ నేను ఎల్లప్పుడూ మన దేశ విదేశాంగ విధానాలకు అనుగుణంగానే వ్యవహరించాను. అందుకే, నేను అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నాను కానీ వారు నిరాకరించారు. ఈ కార్యక్రమంలో నేను మాత్రమే భారతీయ ప్రతినిధిని. ఒక ముస్లిం బోధకుడు మరియు ఒక క్రైస్తవ మత నాయకుడు కూడా ఆహ్వానించబడ్డారు. నేను మాత్రమే హిందూ సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తాను. నేను విశ్వసించే ఏకైక ఇజం మానవతావాదం.
భారత దేశ శాంతి,సామరస్యాలపై మాట్లాడేందుకు అంగీకరించరా ?
తనను ప్రయాణం చేయడానికి అనుమతించినట్లయితే, సమాజాలలో భారతీయులు శాంతి మరియు సామరస్యంతో ఎలా సహజీవనం చేస్తారనే దాని గురించి తాను సదస్సులో మాట్లాడతానని అన్నారు . తాను మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, వల్లభాయ్ పటేల్ మరియు ఇతర నాయకుల గురించి మాట్లాడుతానని పేర్కొన్నారు. కానీ కేంద్రం తనకు అనుమతి ఇవ్వలేదు. వారు తనను ఆపాలనుకుంటున్నారు. వారు తనను ఎంతకాలం ఆపుతారో తాను వారిని అడగాలనుకుంటున్నాను? మీరు నన్ను శాశ్వతంగా ఆపలేరు అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
తనపై అసూయ .. అందుకే ఇలా .. తనను ఆపలేరన్న మమత
అంతేకాదుతనపై మోడీకి అసూయ, అందుకే తనకు అనుమతి ఇవ్వలేదని ఆరోపించారు. బిజెపి సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం తనను అడుగడుగునా అడ్డుకుంటుందని, రాజకీయ కారణాలతోనే ఈ విధంగా ప్రవర్తిస్తోందని మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. కాషాయ దళం తాలిబన్ బీజేపీ అభివర్ణించిన మమతా బెనర్జీ ఉప ఎన్నికల్లో బిజెపిని ఓడించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనపై మండిపడిన ఆమె మీరు విదేశాలకు వెళ్ళవచ్చు కానీ దేశ ప్రయోజనాల దృష్ట్యా తాను ఎప్పుడూ అభ్యంతరం పెట్టలేదని, అలాంటప్పుడు దేశ ప్రయోజనాల దృష్ట్యా తాను ఇటలీకి వెళ్లకూడదా అంటూ ప్రశ్నించారు. శాంతి సదస్సులో పాల్గొనకుండా తనను ఎవరూ ఆపలేరని మమతాబెనర్జీ తేల్చిచెప్పారు.