బీజేపీలోకి చేరుతున్నా.. తేల్చేసిన జయప్రద
న్యూఢిల్లీ: సాధారణ కార్యకర్తగా తాను బీజేపీలో చేరతానని ప్రముఖ నటి, సమాజ్ వాదీ పార్టీ మాజీ ఎంపీ జయప్రద అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ తాను ఏ పదవినీ ఆశించి బీజేపీలోకి చేరడం లేదని స్పష్టం చేశారు.
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్పై పోటీ చేయడానికి బీజేపీలో చేరుతున్నారన్న వ్యాఖ్యలపై ఆమె స్పందిస్తూ... తాను ఎప్పుడూ అలా అనుకోలేదన్నారు. బీజేపీలోకి చేరతానని చెప్పిన విషయాన్ని మీడియానే హైలైట్ చేసి ఇలాంటి వార్తలకు అవకాశమిచ్చిందన్నారు. టికెట్ విషయమై ఎవరితో మాట్లాడలేదని చెప్పుకొచ్చింది.
ఇకనుంచి ఆరోగ్యకరమైన రాజకీయాలను మాత్రమే చేయదలచుకున్నానని చెప్పారు. రాజకీయాల్లో తాను ఏడవనని అన్నారు. నరేంద్రమోడీ నాయకత్వంపై ఉన్న నమ్మకంతోనే బీజేపీలో చేరడానికి సిద్ధమని తెలిపారు. ఈ అంశంపై ఇప్పటికే పార్టీ అగ్రనాయకులను సంప్రదించానని తెలిపారు.
ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు, ములాయం సింగ్ యాదవ్ లాంటి రాజకీయ నేతలతో పని చేశానని, ఐతే సమాజ్ వాది పార్టీలో నా 10 సంవత్సరాల పదవీకాలంలో కొన్ని చేదు అనుభవాలు ఎదుర్కొన్నానని తెలిపారు.
బీజేపీలోని సీనియర్ నేతలతో చర్చలు జరుపుతున్నామని, ఉన్నత స్ధాయిలో ఉన్న వారితో నా గురువు అమర్ సింగ్జీ వారితో మాట్లాడుతున్నారని అన్నారు. అన్ని పూర్తైన తర్వాత, ప్రతి ఒక్కరికీ తెలియజేస్తానని ఆమె చెప్పారు.
ఆంధ్రప్రదేశ్కు చెందిన జయప్రద తెలుగు, హిందీ, ఇతర భాషలతో కలిపి మొత్తం 70 చిత్రాల్లో నటించారు. 1990ల్లో జయప్రద రాజకీయాల్లోకి వచ్చారు. ఇప్పటి వరకు తెలుగుదేశం, సమాజ్ వాది పార్టీ, ఎర్ఎల్డీ పార్టీల్లో పని చేశారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో బింజూర్ నుంచి రాష్ట్రీయ లోక్ దళ్ నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్ధి చేతిలో ఓటమి పాలయ్యారు.