కాశ్మీర్పై మాటల్లేవ్! పీవోకే ఐతే ఓకే: తేల్చేసిన వెంకయ్య నాయుడు
న్యూఢిల్లీ: కాశ్మీర్ అంశంపై చర్చించడానికి ఏమి లేదని, కాశ్మీర్ భారత్లో అంతర్భాగమేనని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. ఇంకేమైనా పొరుగు దేశంతో చర్చించడానికి ఉందంటే అది పీవోకే(పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్) అంశం గురించి మాత్రమేనని ఉపరాష్ట్రపతి వ్యాఖ్యానించారు.
ఆర్టికల్ 370పై దాఖలైన పిటిషన్లను విచారించేందుకు సుప్రీంకోర్టు సుముఖత వ్యక్తం చేయడం, ఈ విషయంలో కేంద్రానికి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో వెంకయ్యనాయుడు పై విధంగా స్పందించారు. ఆర్టికల్ 370పై చర్చించాలంటూ వచ్చిన 15 పిటిషన్లపై అక్టోబర్లో విచారిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో జరిగిన నావల్ సైన్స్, టెక్నాలజీ ల్యాబోరేటరీ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాము యుద్ధాన్ని కోరుకునే వారిమి కాదని, తాము శాంతి ప్రేమికులమని వెంకయ్య స్పష్టం చేశారు.
ఉగ్రవాదులపై పాకిస్థాన్ కఠిన చర్యలు తీసుకోవాలని, వారిని ప్రోత్సాహకాలు నిలిపేయాలని.. అలా చేయని పక్షంలో ఆ దేశంతో ఎలాంటి చర్చలు ఉండబోవని స్పష్టం చేశారు. వెంకయ్యనాయుడు చెప్పిన విధంగానే రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.
జమ్మూకాశ్మీర్ అంశంపై పాకిస్థాన్తో చర్చించేది లేదని కేంద్రమంత్రి రాజ్ నాథ్ వ్యాఖ్యానించారు. ఇంకా ఏదైనా చర్చించాలంటే పీవోకేపైన మాత్రమేనని రక్షణశాఖ మంత్రి స్పష్టం చేశారు.